Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కడప సెంట్రల్ జైలు అధికారిగా వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జైలులో వరుణ్ రెడ్డి జైలర్ గా ఉన్న సమయంలో పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగింది. ఆ తరువాత ఆయన సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఆ వరుణ్ రెడ్డి కడప జైలు అధికారిగా ఉండటంపై వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణ హాని ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం చంద్రబాబు విజయవాడలోని పరుచూరి అశోక్ బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి నిన్న రాత్రి న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చిన విషయం తెలిసిందే. అశోక్ బాబు బెయిల్ పై ఇంటికి రావడంతో శనివారం ఆయన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు.
Read More: AP Special Status: ఏపికి గుడ్ న్యూస్.. ముగిసిపోయిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి
Chandrababu: కడప జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనుమానం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనేక శాఖాపరమైన కేసులు ఉన్నాయనీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయనను పక్కన పెట్టాయని అన్నారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుణ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి కడప జైలు ఇన్ చార్జి సూపర్నిటెండెంట్ గా నియమించారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను చంపేందుకే వరుణ్ రెడ్డిని అక్కడకు పంపారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జైలు అధికారిగా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని పొంచి ఉందని చంద్రబాబు ఆరోపించారు.
Read More: Tirumala: ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ..! వెంకన్నపైనే భారం..
అశోక్ బాబు అరెస్టు అన్యాయం
అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారన్నారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు చంద్రబాబు. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని చంద్రబాబు హెచ్చరించారు.