వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప మండీల బజారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే మండీల బజారులోని వెంకటేశ్వర ట్రేడర్స్ నిత్యావసర వస్తువుల హోల్ సేల్ దుకాణంలో వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం నుండి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో మూడు అగ్ని మాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది షట్టర్లు పగులగొట్టి దాదాపు అయిదారు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
మూడు అంతస్తుల భవనంలో మొత్తం నిత్యావసర వస్తువులు ఉండటంతో పాటు నూనె సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయలకుపై ఆస్తినష్టం జరిగినట్లు హోల్ సేల్ దుకాణ యజమాని భద్రీనాథ్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుండి పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి యాత్ర .. ఉత్తరాంధ్రలోనూ ఇన్ చార్జిలను ప్రకటిస్తారా..?