YSRCP: వైఎస్ఆర్ సీపీలో నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం గోదావరి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇన్ చార్జిల మార్పునకు జగన్ కసరత్తు చేస్తుండటంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.
నియోజకవర్గ ఇన్ చార్జిల మార్పు అంశంపై సీఎం జగన్ ను సోమవారం కలిసిన వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉన్నారు. అలానే పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా సీఎంను కలిశారు. రానున్న ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, మార్పులపై సీఎం జగన్ వీరితో చర్చించారు. అదే విధంగా మంత్రి చెన్నబోయిన వేణుగోపాలకృష్ణ ను పార్లమెంట్ కు పంపే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
జనసేన – టీడీపీ పొత్తు ప్రభావం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఉమ్మడి అభ్యర్ధులను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలను బరిలో నిలిపేందుకు వైసీపీ కసరత్తు చేస్తొందని అంటున్నారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పుపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లోనే ఏ నియోజకవర్గానికి ఎవరు ఇన్ చార్జిలుగా నియమితులు అవుతారు. మార్పులపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
T Congress: తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ.. కాంగ్రెస్ పీఏసీ తీర్మానం