CM YS Jagan: ఏపిలో త్వరలో విఆర్ఓ, వీఆర్ఏలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనున్నది. ఏపి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు రాష్ట్రంలో అర్హత కల్గిన వీఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ను కోరారు. సంఘం ప్రతినిధులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వీఆర్ఓల పదోన్నతుల అంశాన్ని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వీఆర్ఓల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉందనీ, దీంతో చాలా మంది విఆర్ఓలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదని చెప్పారు. వీఆర్ఓల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని సీఎం జగన్ ను కోరినట్లు చెప్పారు.
అలాగే విధి నిర్వహణలో ఎవరైనా విఆర్ఓలు చనిపోతే అతని కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ నుండి విఆర్ఓకు అర్హత కల్గిన 1,500 మందికి అర్హత పరీక్షలు నిర్వహించి విఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తాము తెలిపిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఏపి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్, సీఆర్పీ అధ్యక్షుడు గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ ను తిట్టిన వారు ఎవరైనా పాతాళానికే అంటూ డిప్యూటి సీఎం ‘కొట్టు’ కీలక వ్యాఖ్యలు