అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు టికెట్ల కేటాయింపు పలు పార్టీల్లో గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే… ఈ వివాదాలు ఒకటి రెండు రోజుల్లోనే సమసి పోయాయి. కానీ, విజయవాడ వెస్ట్ సీటులో మాత్రం వివాదం ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఈ సీటును తొలు త టీడీపీ నాయకులు పట్టుబట్టారు. కానీ, చంద్రబాబు వారికి ఇవ్వలేదు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న, జలీ ల్ ఖాన్ వంటివారు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు.
అయినప్పటికీ.. చంద్రబాబు మాత్రం దిగిరాలేదు. అంతేకాదు.. ఈ సీటును జనసేన ఖాతాలో వేసేశారు. ఇది.. బీజేపీ.. టీడీపీ, జనసేనతో చేతులు కలపక ముందు జరిగిన పరిణామం. అయితే… ఆ తర్వాత.. రాజకీయంగా మూడు పార్టీల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు దగ్గర, బీజేపీకి చేరువలో ఉన్న కొందరు నాయకులు టికెట్ లు ఆశించారు. విజయవాడ పార్లమెంటు సీటును ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒకప్పటి టీడీపీ నాయకుడు సుజనా చౌదరి కోరుకున్నారు.
వాస్తవానికి ముందు ఇచ్చేద్దామనే అనుకున్నారు. కానీ, కేశినేని నాని(సిట్టింగ్ ఎంపీ)ని ధిక్కరించి.. ఆయన సోదరుడు గళం వినిపిస్తుండడం.. పార్టీలోనూ మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయనను సడన్గా మారిస్తే. పార్టీకి డ్యామేజీ అవుతుందని భావించిన చంద్రబాబు మళ్లీ మనసు మార్చుకున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరికి ఎంపీ సీటు దక్కలేదు. మచిలీపట్నం నుంచి చేయాలని అనుకున్నా దానిని జనసేనకు ఇచ్చేశారు. మొత్తంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనాకు టికెట్ కావాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే తెరచాటు జరిగిన రాజకీయ చర్చల్లో జనసేన చేతిలో పడిన వెస్ట్ టికెట్ను.. బీజేపీకి ఇచ్చేశారని టాక్. ఈ సీటు నుంచి విజయవాడ పరిధిలోనే ఉన్నందున సుజనాను నిలబెట్టాలనేది బీజేపీ వ్యూహం. అందుకే.. ఈ సీటును జనసేన నాయకుడు పోతిన మహేష్కు కూడా దక్కడం లేదని తెలుస్తోంది. కానీ, ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. నిరాహార దీక్షలకు కూడా దిగారు. దీంతో ఇప్పుడు వెస్ట్ సీటులో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.