Janasena: జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభలో పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఏడు నుండి 27 శాతం ఓట్లు సాధించుకున్నాం, రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శాతంకు చేరుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. 150 మందితో మొదలైన క్రియాశీల సభ్యత్వం త్వరలో అయిదు లక్షలకు చేరుకుంటుందన్నారు. ఈ చీకటి పాలనను అంతమొందించి వెలుగులోకి తీసుకురావాలన్నారు. జనసైనికులు, వీరమహిళలు లేకపోతే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేడని అన్నారు. 2024 ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ అన్నారు. రెండున్నర సంవత్సరాల వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో వైసీపీలో మంచి నాయకులు ఉన్నారని అన్నారు.
Janasena: వైసీపీ అశుభంతో పాలన ప్రారంభించింది
151 మంది గెలిస్తే ఎంత బాగా పరిపాలన చేస్తారని ఎదురుచూశానన్నారు. వైసీపీ వాళ్లపై వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు పవన్ కళ్యాణ్. మీ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా తాను ఏమీ మాట్లాడేవాడిని కాదని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా శంకుస్థాపనలతో పాలన ప్రారంభిస్తారనీ, కానీ వైసీపీ కూల్చివేత లు అశుభంతో పాలన ప్రారంభించారని విమర్శించారు. వైసీపీ ఇసుక పాలసీ వల్ల 32 కార్మికులను బలి అయ్యారనీ, లక్షలాది మంది కార్మికుల పొట్టగొట్టారన్నారు. వైసీపీ లక్ష్యాలు ఇవి అంటూ వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగ స్పూర్తి గురించి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలను వినిపించారు పవన్ కళ్యాణ్. రాజులు మారినంత రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పాలసీలు మారవని అన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని ప్రతిపాదన చేసినప్పుడు మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. మూడు వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన తరువాత ఇప్పుడు రాజధాని మారుస్తారా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఎక్కడకు రాజధాని తరలివెళ్లదు అని అమరావతి ప్రాంత రైతులకు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అమరావతి విషయంలో న్యాయవ్యవస్థను కూడా తప్పుబట్టే స్థాయికి వైసీపీ వెళ్లిందని విమర్శించారు. పోలీసులకు డీఏలు, టీఏలు కూడా ఇవ్వడం లేదన్నారు. రూల్స్ ప్రకారం నడుచుకునే అధికారులను ఈ ప్రభుత్వం వీఆర్ లోకి పంపుతోందన్నారు.
అన్ని వర్గాలకు వరాలు
ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు మొండిచేయి చూపించారన్నారు. వైసీపీ మాటలకు అర్ధాలే వేరని అన్నారు. జీతాలు పెంచుతామంటే తగ్గిస్తామని, మద్య పాన నిషేదం చేస్తామంటే మద్య పానం పెంచుతామని వారి అర్ధమని అన్నారు. రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది అంటే దాని వల్ల మనకు ఏమినష్టం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. ఏపిలో ఉన్న పరిశ్రమలను వెళ్లగొడుతున్నారనీ అందుకే కొత్త పరిశ్రమలు రావడం లేదని అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామనీ, అందుకు నూతన పారిశ్రామిక విధానం తీసుకువస్తామన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. అలానే విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలుకు దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేస్తామన్నారు. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. అల్పాదాయ వర్గాలకు ఇసుక ఉచితంగా ఇస్తాం. ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. జనసేన అధికారంలోకి చేయబోయే ప్రణాళికలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారనీ, వారు రోడ్ మ్యాప్ ఇవ్వగానే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దించుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చబోమనీ, పొత్తుల విషయంపై తరువాత మాట్లాడతామన్నారు.