Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వడానికి వైసీపీ సిద్దమైంది. ఆయన కోరితే కాకినాడ ఎంపీ స్థానంతో పాటు ఆయన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా నూతన సంవత్సర వేడుకలను కిర్లంపూడి లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అదే రోజు ఆయన కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ వాయిదా పడింది. టీడీపీ, జనసేన కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుండటంతో వైసీపీ లో చేరిక ఖాయమని అందరూ భావిస్తున్నారు. మొన్నటి వరకూ ఆయన నివాసానికి వైసీపీ ముఖ్యనేతలు క్యూకట్టి చర్చలు జరిపారు.
తాజాగా జనసేన, టీడీపీ నేతలు ముద్రగడతో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ముద్రగడతో కలిసి తమతో కలిసి రావాలని కోరారుట, కాపు పెద్దలంతా ఈ సారి కలిసికట్టుగా పని చేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయనకు అందించారు. తాజాగా ఈరోజు ముద్రగడ ఇంటికి టీడీపీ నేతలు క్యూకట్టారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పని చేయాలని ఆయనకు చెప్పనున్నారు. టీడీపీ – జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయనను కోరనున్నారు.
ఒక పక్క వైసీపీ, మరో పక్క టీడీపీ – జనసేన నేతలు ముద్రగడతో సమాలోచనలు జరుపుతుండటంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ ఇంట జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన అభిమానులు మాత్రం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటా తామంతా మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే టీడీపీ, చంద్రబాబు వ్యతిరేక భావజాలంతో ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేనకు ఎలా మద్దతు ఇస్తారు అనేదే పెద్ద ప్రశ్నగా ఉంది. ఆత్మీయ సమావేశం నిర్వహించి పది రోజులు దాటుతున్నా ముద్రగడ ఏమి తేల్చకపోవడంతో ఆయన మదిలో ఏముంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరో పక్క సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ – జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలోనే అభ్యర్ధుల ఎంపికలో స్ట్రాటజీ మార్చేశారు. బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ శాతం టికెట్ లు బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఇన్ చార్జిలు, సిట్టింగ్ ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మంది బీసీ నేతలకు టికెట్ లు ఇచ్చి ఆ వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే పనిలో వైసీపీ ఉంది.
YSRCP: నేడు 30 మందితో మూడో జాబితా విడుదల ..! ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు వీరే..?