Transfer: సాధారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష పార్టీ విమర్శలు, సూచనలు ఏమీ పట్టించుకోరు. టీడీపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందనీ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించదని వైసీపీ పేర్కొంటుంటుంది. కానీ టీడీపీ చేసిన ఈ ఆరోపణ విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఇటీవల కడప సెంట్రల్ జైలు అధికారి వరుణారెడ్డిని నియమించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. గతంలో పరిటాల రవి హత్య కేసు ప్రధాన నిందితుడు మొద్దు శ్రీనును అనంతపురం జైలులోనే తోటి ఖైదీ హత్య చేశారనీ, ఆ సమయంలో జైలు ఇన్ చార్జి అధికారిగా ఉన్న వరుణా రెడ్డిని ఇప్పుడు కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జిగా ఉన్నారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు నిందితులు ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారనీ, వారికి ప్రాణ హాని పొంచి ఉందని ఆరోపించారు చంద్రబాబు. మరో పక్క ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు లేఖ రాశారు.
Transfer: కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి అధికారి బదిలీ
వివేకా హత్య కేసులో నింధితులకు కడప జైలులో రక్షణ లేదనీ, ఆ నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం గానీ లేక అక్కడ ఉన్న జైలు ఇన్ చార్జి అధికారి వరుణారెడ్డిని వేరే జిల్లాకు బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. అక్కడి జైలు అధికారిపై గతంలో ఉన్న అభియోగాలను లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపర్నిటెండెంట్ గా ఉన్న వరుణారెడ్డిని ఒంగోలు జిల్లా జైలుకు బదిలీ చేసింది. ఒంగోలు జిల్లా జైలు సూపర్నింటెండెంట్ ప్రకాశ్ ను కడప జైలుకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకా హత్య కేసు విషయంపై టీడీపీ చాలా కాలంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కడప జైలులో వివేకా హత్య కేసు నిందితులపై ఏమైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన ప్రభుత్వం సీబీఐ జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వకముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న జైలు అధికారి వరుణారెడ్డి పై బదిలీ వేటు వేసింది.