Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తరచు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో మారు టీడీపీపై సంచలన కామెంట్స్ చేశారు. ముక్కుసూటి మనస్థత్వం కల్గిన కేశినేని నాని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. టీడీపీలోని గ్రూపు రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలు ఆయన అలా మాట్లాడటానికి కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే .. టీడీపీ మహానాడుకు ఎంపీ కేశినేనికి అహ్వానం కూడా లేదట. తనను ఎవరూ పిలవలేదని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా మాట్లాడితే టీడీపీకి ఉన్న ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో రామ్మోహన్ నాయుడు మాత్రమే మాట్లాడతారని చెప్పారన్నారు. అక్కడ తన అవసరం లేదని ఆహ్వానించకపోవడంతో వెళ్లలేదన్నారు.
విజయవాడలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సైతం తనను ఆహ్వానించలేదనీ, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చారనీ, వీటిని బట్టి ఏమి సంకేతాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధినాయకుడి పీఏ ఫోన్ చేసి చెప్పడం వల్ల వెళ్లానన్నారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఎందుకో తనకు తెలియదని అన్నారు. పార్టీలో ఇన్ చార్జిలు ఎవరో గొట్టంగాళ్లంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారని పేర్కొన్నారు. ఇన్ చార్జిలు అంటే ఆ పార్టీ నియమించుకునే పదవులు అని అన్నారు. తనకు పార్టీలో ఏ పదవి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యుడిని మాత్రమేనని చెప్పారు. తాను మంచి వాడిని కాబట్టే ఇతర పార్టీల నుండి ఆహ్వానాలు వస్తున్నాయన్నారు.
తనను ఓ మీడియా ప్రతినిధి పార్టీ దూరం పెడితే ఏమి చేస్తారని అడిగితే విజయవాడ ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పాననీ, ఇప్పుడు అదే మాట అంటానన్నారు. టీడీపీ ఇన్ చార్జిలను ఉద్దేశించి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర సంచలనం రేపాయి. కేశినేని నాని తరచుగా చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే టీడీపీలో ఇమడలేకపోతున్నారని, ఆ పార్టీ నేతలతో గ్యాప్ బాగానే ఉందని అర్ధమవుతోందని అంటున్నారు. ప్రస్తుతం నాని కామెంట్స్ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో కేశినేని నాని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారా .. లేక పార్టీ మారతారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ విజయవాడ పార్లమెంట్ టికెట్ దాదాపు నాని సోదరుడు కేశినేని చిన్నికి ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతున్నందు వల్లనే నాని పార్టీ దిక్కార స్వరం వినిపిస్తున్నారనే మాట వినబడుతోంది.
YSRCP: వైసీపీలో మరల యాక్టివ్ అయిన విజయసాయిరెడ్డి