` ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ` దేశవ్యాప్తంగా దుమ్మురేపిన కేజీఎఫ్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. ఈ ఇద్దరు నటీనటుల మధ్య సంభాషణ సినిమాలోనే హైలెట్ .
సరిగ్గా అలాంటి ఆసక్తి రేపే ఘటనలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా కొనసాగుతున్న `ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణ` అంశంలో నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
గొప్ప హైడ్రామా
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సీఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం భేటీ అయింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పొలింగ్ తరహాలోనే జరపాలన్న కేంద్రం గైడ్ లైన్సును వివరించినట్టు సమాచారం. ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని దఫదఫాలుగా చేపట్టామని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలను ఎస్ఈసీకి వివరించినట్టు చెబుతున్నారు. ఈ నెలలోనే కేంద్రం కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశముందనే భావనను ఎస్ఈసీ వద్ద వ్యక్తం చేసిన అధికారులు ప్రస్తుతానికి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని తెల్చేసినట్టు చెబుతున్నారు.
నిమ్మగడ్డ సంచలనం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంపై చర్చోపచర్చలు ఓ వైపు కొనసాగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనవరి 23,27,31, ఫిబ్రవరి 4 న పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో తలమునకలై ఉండనున్నందున…. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ టీం ను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ రేంజ్లో చాలెంజ్ చేశారని అంటున్నారు. దీనిపై సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో మరి!