LPG Gas : ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరో వైపు వంట గ్యాస్ సిలెండర్ ధరలు అమాంతం పెరుగుతుండటం సామాన్యులకు మరింత భారం అవుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ సామాన్యులపై భారం పడేలా ధరలు పెరుగుతుండటంతో గృహిణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే నెలలో మూడు సార్లు వంట గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగాయి. తాజాగా నేడు వంట గ్యాస్ సిలెండర్ పై రూ.25లు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
ఈ నెల నాల్గవ తేదీన సిలెండర్ పై రూ.25 లు పెంచగా, ఆ తరువాత 15వ తేదీన మరో రూ.50లు పెరిగింది. ఇప్పుడు మరో సారి రూ.25లు పెంచడంతో ఈ నెలలో మొత్తం రూ.100లు పెరిగినట్లు అయ్యింది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలెండర్ ధర రూ.818లకు చేరింది. వివిధ ప్రాంతాల్లో రెండు మూడు రూపాయల వ్యత్యాసం ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపైనా పడుతోంది. రవాణా చార్జీలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి వర్గాలకు పెనుభారం అవుతున్నాయి.
రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన జరగనుంది. వివిధ రాజకీయ పక్షాల నేతలు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పురపాలక సంఘ ఎన్నికలు అయిన వెంటనే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలియజేసింది. కోర్టులో వచ్చే తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ చర్యలు చేపట్టనున్నది. ఎన్నికల వేళ నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు నేతలను నిలదీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి.