Mamillapalli Blasting Case: ఇటీవల కడప జిల్లా మామిళ్లపల్లె వద్ద జరిగిన పేలుళ్లలో పది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురాయి గనుల్లో జరిగిన ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే క్వారీ లీజుదారు జీపిఏ హోల్డర్ నాగేశ్వరరెడ్డితో మరొకరిని అరెస్టు చేశారు. తాజాగా అధికార పార్టీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ కుటుంబానికి చెందిన ప్రతాప్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడం జిల్లాలో సంచలనం అయ్యింది. ప్రతాప్ రెడ్డిని కోర్టులో హజరుపర్చినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
పేలుళ్ల ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసు యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేశారు. గనిలో వినియోగించడానికి తీసుకువచ్చిన జిలెటన్ స్టిక్స్ ఎక్కడి నుండి తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీయగా పులివెందుల నుండి కలసపాడు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేయగా పులివెందులలో వైఎస్ ప్రతాప్ రెడ్డికి చెందిన మ్యాగజైన్ లైసెన్స్ నుండి జిలెటన్ స్టిక్స్ తరలించినట్లు తెలిసింది.
ఎలాంటి భద్రతా పరమైన చర్యలు చేపట్టకుండా తరలించారనీ, లైసెన్సు లేని వ్యక్తికి పేలుడు పదార్థాలను విక్రయించారన్న అభియోగంపై ప్రతాపరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రతాప్ రెడ్డికి పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్ స్టిక్స్ కు మ్యాగజైన్ లైసెన్సు ప్రతాపరెడ్డికి ఉంది. ఈ క్రమంలో పులివెందుల నుండి మామిళ్లపల్లె గనులకు జిలెటన్ స్టిక్స్ తరలించి అక్కడ అన్ లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.