Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో ఆన్లైన్ టికెటింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయిస్తూ అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ పక్క ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే సినీ పరిశ్రమ మేలు కోసం ఓ అభ్యర్ధన చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే జీఎస్టీ ఉన్నప్పుడు టికెట్ల ధరలు కూడా అలాగే ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే టికెట్ల ధరలను నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు మెగాస్టార్. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు చిరంజీవి.
“పరిశ్రమ కోరిన విదంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే అధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్ల్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీ గా ట్యాక్స్ లు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం వున్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది” అని మెగాస్టార్ చిరు ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నిన్న మీడియా సమావేశంలో ఏపి మంత్రి పేర్ని నాని ఓ విషయాన్ని స్పష్టం చేశారు. పెద్ద హీరోల సినిమాలు అయినా, చిన్న హీరోల సినిమాలు అయినా ప్రభుత్వం దృష్టిలో అన్ని సమానమేననీ, ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్ లైన్ విధానం ద్వారా టికెట్లు విక్రయించే వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం కఠిన నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టడం వల్ల ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని, సినిమానే అధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువుకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. కాకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే పరిస్థితి వాళ్లకు లేదు. దీంతో ఇదే విషయాన్ని చిరంజీవి చాలా పాలిష్డ్గా చెప్పి ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.