YSRCP: అధికార వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కలకలం రేపుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే నియోజకవర్గంలోని పలువురు నాయకులు రాజీనామా బాటపట్టారు. వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి రాజీనామా చేశారు. అలానే తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు, జేసిఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ జేసిఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లవరపు సుధారాణి లు రాజీనామా చేశారు.
అలానే మంగళగిరి మాజీ కౌన్సిలర్ కలకోటి స్వరూప రాణి, నియోజకవర్గ నాయకులు కలకోటి బోయోజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్కే రాజీనామా నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ నేత గంజి చిరంజీవికి సీఎంఓ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆర్కేను పక్కన పెట్టాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు గా వార్తలు రావడం, ఆ వెంటనే గంజి చిరంజీవికి పార్టీ అధినేత, సీఎం జగన్ నుండి పిలుపు రావడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఇన్ చార్జి పదవికి ఇవేళే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడే దేవన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తిప్పల నాగిరెడ్డి. అనంతరం ఆయన కుమారుడు దేవన్ రెడ్డికి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పార్టీ నియమించింది.
రాబోయే ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ సీటును బీసీ (యాదవ) సామాజికవర్గంకు కేటాయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం వల్లనే దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ మంగళగిరిలో, అటు గాజువాకలో బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురవుతూ రాజీనామా బాటపడుతున్నారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.