Alla Ramakrishna Reddy: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖ అందజేశారు ఆర్కే. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆర్కే సభాపతి (స్పీకర్) అందుబాటులో లేకపోవడంతో సభాపతి కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేశారు. కాగా, ఆర్కే రాజీనామా విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆర్కే రాజీనామా లేఖ అందిందని చెప్పారు. ఆ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి ఉందని, ఆపై రాజీనామా లేఖ సరైన ఫార్మట్ లో ఉందా లేదా అనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. ఇదే క్రమంలో పార్టీపై అసంతృప్తితో ఆర్కే రాజీనామా చేశారన్న ప్రచారాన్ని తమ్మినేని ఖండించారు. అలా అసంతృప్తితో ఉంటే సీఎం జగన్ తో సన్నిహితంగా ఎందుకు ఉంటారని అంటూ ఆ ప్రచారాన్ని కొట్టి పారేశారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ అందజేసినా స్పీకర్ తమ్మినేని దాన్ని ఆమోదించలేదు. మరో అయిదారు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆర్కే రాజీనామాను స్పీకర్ అమోదిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఎమ్మెల్యే రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహరించాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోపే సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో మంగళగిరికి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదని అంటున్నారు.
ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్కే మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా లేఖలో పేర్కొన్న ఆర్కే.. మీడియా సమావేశంలో మాత్రం రాజీనామాకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్లనే అసంతృప్తితో ఆర్కే రాజీనామా చేశారన్న వాదన వినబడుతోంది.
1995 నుండి రాజకీయాల్లో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి 2004 లో కాంగ్రెస్ పార్టీ నుండి సత్తెనపల్లి సీటు ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేదు. ఆ తర్వాత 2009 లో పెదకూరపాడు అసెంబ్లీ సీటు ఆశించినా దక్కలేదు. రెండు సార్లు టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే పని చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి మంత్రి నారా లోకేష్ పై ఆర్కే గెలిచారు. అయితే రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి బీసీ (చేనేత) వర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నుండి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి పార్టీ బాధ్యతలు అప్పగించింది.
YSRCP: పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా