ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగు చూసిన దారుణాతి దారుణ ఘటన యావత్ భారతదేశాన్ని షాక్ గురి చేసింది. ఈ ఘటన పోలీసు అధికారులనే తీవ్ర నిర్ఘాంతపరచింది. విద్యావంతులైన దంపతులే మూడ భక్తితో కన్నబిడ్డలను అతి కిరాతకంగా హత్య (బలి) చేసిన యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే..మదనపల్లెకి చెందిన వి పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పురుషోత్తమ నాయుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పద్మజ స్థానిక ప్రశాంత్ నగర్ లో మాస్టర్ మైండ్స్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ నిర్వహిస్తోంది. పెద్ద కుమార్తె అలేఖ్య (27) భోపాల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్న కుమార్తె సాయిదివ్య బీబీఏ పూర్తి చేసి చెన్నైలోని ఏఆర్ రెహమాన్ ఇన్స్ స్టిట్యూట్ లో మ్యూజిక్ శిక్షణ పొందింది. కరోనా నేపథ్యంలో వీరిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. వీరు ఉన్నత చదువులు చదివినా చిన్నతనం నుండి తల్లి చూపిన ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. చివరికి వీరి మూఢ భక్తి ఎంత వరకూ వచ్చిందంటే దేవుడిని తమలో ఐక్యం చేసుకోవాలని తల్లిదండ్రులతో కలిసి కొన్ని నెలలుగా ఇంటినే ఒక మందిరంగా మార్చేసుకున్నారు. క్షుద్రపూజలపై విపరీతమైన నమ్మకమున్న పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు వారి ఇంటి చుట్టుపక్కల ఎవరినీ ఇంటిలోకి రానీయకుండా ఎవరితో కలవకుండా వ్యవహరించే వారు.
నాలుగు రోజులుగా ఇంటి నుండి ఎవరూ బయటకు రాకుండా పూజల్లో నిమగ్నమైయ్యారు. ఈ క్రమంలో ఆదివారం పూజల అనంతరం మొదట సాయి దివ్యను తరువాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్ తో కొట్టి హత్య చేశారు. వీరి ఇంట్లో నుండి పెద్ద ఎత్తున శబ్దాలు రావడం, వింత అరుపులు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ రవి మనోహరాచారి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పురుషోత్తం నాయుడు, పద్మజలను పోలీసులు ప్రశ్నించగా వింత సమాధానాలు చెబుతున్నారు. తమ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయనీ, తమ ఇద్దరు కుమార్తెలు ఉదయానికల్లా తిరిగి లేచి వస్తారని చెబుతున్నారు. ప్రాధమిక దర్యాప్తు ఆధారంగా పిల్లలు ఇద్దరిని వీరే హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు వారి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిసి కెమెరాల పుటేజీని పరిశీలన చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది.