MP Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీల బృందం మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. పలు పెండింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏపిలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత విజయసాయి మీడియాకు వివరాలు వెల్లడించారు. అరకు రైలుకు విస్టోడోమ్ కోచ్ ల సంఖ్య పెంచమని కోరినట్లు విజయసాయి తెలిపారు.
MP Vijayasai Reddy: రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇవ్వండి
ఏపికి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయమని కోరారు. ఏపిలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. వాల్తేర్ డివిజన్ ను కొనసాగించాలని కోరామన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని విజయసాయిరెడ్డి తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎంపీల సంతకాల సేకరణ
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల నుండి సంతకాలను సేకరించామని విజయసాయి రెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక సమితితో కలిసి ఎంపీల సంతకాల జాబితాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందజేస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.