Murder: కృష్ణాజిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి గొడ్డలితో భార్య, కుమారుడిపై దాడి చేయగా భార్య మృతి చెందింది. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత అతను పోలీస్ స్టేషన్ లో లొంగిపాయాడు.
Read more: Dk Aruna: డీకెే అరుణ భేటీ ఫలప్రధం..! రేపోమాపో విశ్వేశ్వరరెడ్డి కూడా కాషాయం గూటికి..!!
విషయం ఏమిటంటే .. తిరువూరు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి (60), పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు లండన్ లో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు నర్శిరెడ్డి టేకులపల్లిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి తిరువూరు ఓ ఇల్లు ఉండగా దాన్ని అద్దెకు ఇచ్చారు. ప్రతి నెలా ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డి గత కొంత కాలంగా భార్య, కుమారుడిని వేధిస్తున్నాడు. తిరువూరు పట్టణంలో ఉన్న ఇంటి తాలూకు అద్దె డబ్బుల విషయంలో సత్యనారాయణరెడ్డి భర్తలతో గొడవ పడ్డాడు. దీంతో పద్మావతి భర్తపై తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భార్య భర్తల పంచాయతీ కావడంతో తిరువూరు పోలీసులు గురువారం సత్యనారాయణరెడ్డికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించి వేశారు.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో సత్యనారాయణరెడ్డి గురువారం రాత్రి గొడ్డలితో భార్య పద్మావతి, కుమారుడు నర్సిరెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. నర్శిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. హత్య అనంతరం సత్యనారాయణరెడ్డి బైక్ పై పరారైయ్యాడు. గంపలగూడెం, రుద్రవరం, రంగాపురం మీదుగా నూజివీడు వైపు వెళుతుండగా నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు రక్తం మరకలతో ఉన్న సత్యనారాయణ రెడ్డి చూసి అదుపులోకి తీసుకున్నారు. తాను పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడానికి వస్తున్నట్లు ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి వారికి చెప్పినట్లు తెలిసింది. తమ భార్య భర్త పంచాయతీ విషయంలో తిరువూరు పోలీసులు తననే దూషించి తన భార్య పట్ల సానుభూతి వ్యక్తం చేశారనీ, అక్కడకు వెళ్ళి లొంగిపోతే తనపై దాడి చేస్తారన్న భయంతో నూజివీడు పోలీసులకు లొంగిపోయేందుకు వస్తున్నట్లు సత్యనారాయణరెడ్డి చెప్పడం గమనార్హం.