Nimmagadda Ramesh Kumar : ఏపిలో స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా సుప్రీం కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూడటం వల్ల జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ లు జారీ చేయలేదు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికను నాల్గవ విడతగా మార్పు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ గా దృష్టి సారించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ఎన్నికల విధుల నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల విధి నిర్వహణపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు.
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ క్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. సుప్రీం కోర్టు తీర్పును దిక్కరించాలని జగన్ ప్రభుత్వం అనుకుంటే ఉద్యోగులు అదే పని చేసే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ కూడా సహకరించని పరిస్థితులు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ బలగాలు, సిబ్బందితో ఎన్నికలు నిర్వహించేందుకు సైతం ఎస్ఈసీ సన్నద్దం అవుతున్నట్లుగా కనబడుతోంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్రానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ నివేదించినట్లు తెలుస్తోంది. ఒక వేళ కేంద్ర సిబ్బంది, బలగాలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్త సీఎం జగన్ కు భారీ దెబ్బేనంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరితే కేంద్రం నుండి సహకారం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కేంద్ర బృందాలు వస్తే రాష్ట్రం పరువు పోతుందని భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ ఎన్నికలకు సహకరించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.