ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం టీడీపీలో కల్లోలం రేగింది. ఎప్పటి నుంచో ఉన్న కలమట వెంకటరమణకు ఈ దఫా చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. వాస్తవానికి తనకే టికెట్ ఇస్తారని వెంకటరమణ ప్రచారం చేసుకున్నారు. కానీ, తొలి జాబితాలోనే ఆయనకు అవకాశం రాలేదు. పోనీ.. తర్వాతైనా ఇస్తారని అనుకున్నా.. అప్పుడు కూడా దక్కలేదు. చివరకు.. ఇక్కడ మామిడి గోవిందరావుకు చంద్రబాబు చాన్స్ ఇచ్చారు.
ఈ పరిణామమే.. టీడీపీలో కల్లోలం రేపింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన కలమట వెంకటరమణ.. టీడీ పీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు. ఇక్కడ టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని కూడా చెప్పారు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన రమణ.. గత 2014లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి విజయందక్కించుకున్నారు. 2018లో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్లో ఆయన కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే 2019లో టికెట్ తెచ్చుకున్నారు.
అయితే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఓడిపోయారు. అది కూడా దారుణంగా పరా జయం పాలయ్యారు. వైసీపీ తరఫున బరిలో నిలిచిన రెడ్డి శాంతి 15 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కిం చుకున్నారు. ఇక, ఇప్పుడు ఆమెపై ఉన్న వ్యతిరేకత, వైసీపీలో ఏర్పడిన చీలికలు, వర్గ పోరును తనకు అనుకూలంగా మార్చుకుని.. గెలుపు గుర్రం ఎక్కాలని.. కూటమి పక్షం తరఫున పోటీ చేస్తే.. గెలుపు సాధ్యమేనని కలమట వెంకట రమణ లెక్కలు వేసుకున్నారు.
కానీ, ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు మామిడి గోవిందరావుకు అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంం ఇప్పుడు గెలిచే సీటును టైట్ చేసేసింది. తనకు టికెట్ లేదన్న విషయాన్ని కనీసం చెప్పకుండానే అవమానించారంటూ కలమట నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు కాపుల గడపలకు వెళ్లి టీడీపీని ఓడించాలని ప్రచారం చేస్తానని చెబుతున్నారు. ఇదే జరిగితే.. గెలిచే సీటు టీడీపీ నుంచి జారిపోవడం ఖాయం. మరోవైపు వేడిలో వేడి.. అన్నట్టుగా కలమట వస్తే.. స్వాగితిస్తామంటూ.. వైసీపీ ఆహ్వానం పలికింది. దీంతో ఆయన రేపో మాపో.. వైసీపీ చెంతకు చేరనున్నట్టు తెలుస్తోంది.