కృష్ణా జిల్లాలోని తీరప్రాంత నియోజకవర్గమైన అవనిగడ్డలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇదేసమయంలో ఈ సీటు వ్యవహారం ఎటూ తేలక.. కూటమి పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నియోజకవర్గం పరంగా చూస్తే.. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ కృష్ణా డెల్టాలోని కీలక ప్రాంతం. కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా గెలుపొందిన అవనిగడ్డలో ప్రస్తుతం వైసీపీ పాగా వేసింది. ఆ పార్టీ నుంచి సింహాద్రి రమేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచినా…అవనిగడ్డలో మాత్రం కాంగ్రెస్ తరఫున మండలి కృష్ణారావు గెలుపొందడం విశేషం. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వక్కపట్ల శ్రీరామ్ప్రసాద్పై విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి సింహాద్రి సత్యనా రాయణరావు విజయం సాధించారు. మూడుసార్లు వరుసగా గెలిచిన మండలి కృష్ణారావును ఆయన ఓడించారు.
1989లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే పోటీ చేయగా కేవలం 167ఓట్ల తేడాతో సింహాద్రి సత్యనారాయణ విజయం సాధించారు.1994లో తెలుగుదేశం నుంచి మరోసారి సింహాద్రి సత్యనారాయణ పోటీ చేయగా… కాంగ్రెస్ తరపున మండలి కృష్ణారావు తనయుడు బుద్ధప్రసాద్ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి గెలిచి సింహాద్రి సత్యనారాయణ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు.
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి మండలి బుద్దప్రసాద్ పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి బూరగడ్డ రమేశ్నాయుడుపై కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లోనూ కాంగ్రెస్ నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయగా…తెలుగుదేశం బూరగడ్డ రమేశ్నాయుడిని పోటీకి నిలపింది. ఈ ఎన్నికల్లోనూ మండలి గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తండ్రిలాగా హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మండలి బుద్ధప్రసాద్…. 2009లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం నుంచి అంబటి బ్రాహ్మణయ్య పోటీ చేసి స్వల్ప ఓట్లు 417 తేడాతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి సింహాద్రి రమేశ్ పోటీపడి మండలి గెలుపు అవకాశాలను దెబ్బతీశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశంలో చేరారు. 2014 ఎన్నికల్లో అవనిగడ్డలో ఆసక్తికర పోటీ నడిచింది. తెలుగుదేశం నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీపడగా… వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ బరిలో నిలిచారు. గతంలో వీరి తండ్రులు సైతం ప్రత్యర్థులుగా పోటీపడ్డా రు.
కాకపోతే రమేశ్ తండ్రి తెలుగుదేశం నుంచి పోటీలో ఉండగా..ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మండలి కృష్ణరావు తనయుడు తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ నుంచి పోటీపడ్డారు. తన తండ్రిని ఓడించిన సింహాద్రి సత్యనారాయణ కుమారుడు రమేశ్ను ఈ ఎన్నికల్లో ఓడించి మండలి బుద్ధప్రసాద్ బదులు తీర్చుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి వీరిద్దరే పోటీ చేయగా…వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంటే మొత్తంగా ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు టీ కెట్ కేటాయించినా.. అభ్యర్తిని ప్రకటించడంలో జరుగుతున్న తాత్సారంతో టీడీపీ నేతలు ఎంత వరకు సాయం చేస్తారనేది ప్రశ్న.