పశ్చిమ గోదావరి జిల్లాలో పాగా వేయాలని జనసేన.. సత్తా చూపించాలని టీడీపీ.. చాలా కృషి చేస్తున్నా యి. రాజకీయంగా పొత్తులు పెట్టుకుని మరీ.. పోటీ చేస్తున్నా.. టికెట్లు పంచుకున్నా.. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కూటమి గెలుపు ఖాయమైందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కష్టమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
దెందులూరు: ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మరోసారి వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక, కూటమి తరఫున టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో చింతమనేని ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. రైతులను బెదిరించారని.. పోలవరం పూర్తిచేయలేక పోయారన్న విమర్శలు వున్నాయి. దీంతో చింతమనేని గెలుపు ఖాయమైందని అంటున్నారు. జనసేన నాయకులు , కార్యకర్తలు కూడా.. ఆయనకు అండగా ఉ్నారు.
ఆచంట: ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు పోటీకి దిగుతున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. సత్యనారాయణ బీసీ సామాజిక వర్గం కావడం.. నిదానస్తుడు, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రంగనాథరాజుకు వయసు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
పాలకొల్లు: ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు. కూట మి అభ్యర్థిగా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన నిమ్మల రామానాయుడు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ గెలుపును ఎప్పుడో రాసిపెట్టుకోవడం గమనార్హం. ఈ ఐదేళ్ల కాలంలో కేవలం నెల రోజుల మాత్రమే నిమ్మల ఇంటి ముఖం చూశారు. మిగిలిన అన్ని రోజులు ప్రజల మధ్యే ఉన్నారు. ఇది ఆయనకు ఎవర్ గ్రీన్ మద్దతు వచ్చేలా చేస్తోంది.