ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో బీసీ నాయకుడు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీ పీ నేత అనగాని సత్యప్రసాద్ విజయం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు ప్రజలు. ఇప్పటికే రెండు సార్లు ఆయన విజయం దక్కించుకున్నారు. 2014, 2019లో ఆయన వరుస విజయాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా సాగినప్పుడు కూడా.. ఇక్కడ అనగాని గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. గత ఐదేళ్లలో ఆయనకు రెండు నుంచి మూడు సార్లు వైసీపీలోకి చేరాలంటూ.. ఆఫర్లు వచ్చాయి.
అయినా.. తనకు నియోజకవర్గమే ముఖ్యమంటూ.. ఇక్కడే టీడీపీలోనే ఉండిపోయారు. ఇది ఆయనకు కొండంత బలంగా మారింది. `మా నాయకుడు ప్రలోభాలకు లొంగే నేత కాదు` అని జనాలు చెప్పుకొనే రేంజ్లో ఆయన సానుభూతి పొందారు. ఇది ఆయనకు ప్లస్గా మారింది. పైగా.. ఐదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నా.. ఆయన ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. అంతేకాదు.. ఎక్కడా వివాదాలకు తావులేకుండా.. ముందుకు సాగారు.
పార్టీ కేడర్ను కలుపుకొని ముందుకు సాగారు. ఇది అనగాని గ్రాఫ్ను మరింత పెంచేలా చేసింది. ఇక, వైసీపీ తరఫున ఈపూరు గణేష్ను వైసీపీ రంగంలోకి దింపింది. ఈయన వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ.. నియోజకవర్గానికి కొత్త నాయకుడు. పైగాఈ టికెట్ను రాజ్యసభ సభ్యుడుమోపిదేవి వెంకటరమణ వర్గం ఆశించింది. ఆయన కుమారుడిని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ, అధిష్ఠానం ఒప్పుకోలేదు. దీంతో ఈ అసంతృప్తి ఇంకా కొనసాగుతోంది. పైకి.. కలిసిపోయినట్టు వ్యవహరిస్తున్నారు.
కానీ.. మోపిదేవి వర్గంలో గణేష్పై వ్యతిరకత కొనసాగుతోంది. ఇది వారు కీలక ఎన్నికల సమయంలో బయట పెట్టినా ఆశ్చర్యంలేదు. పైగా.. టీడీపీ ఎమ్మెల్యే అనగానితో మోపిదేవికి వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు. కేవలం రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయి. ఇక, గణేష్ గెలిస్తే మాత్రం తమ హవాకు బ్రేకులు పడతాయని భావిస్తున్న మోపిదేవి వర్గం.. దాదాపు ఆయనకు ఏదో ఒకరకంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందనే అంచనాలు కూడా వస్తున్నాయి.
అంటే.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. అలానే ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా అనగానిని గెలిపించేందుకు ప్రజలకు ఒక అవకాశంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. అనగాని మరోసారి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వస్తే బీసీ – గౌడ కోటాలో ఆయనకు మంత్రి పదవి పక్కా అంటున్నారు.