TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి బైబై చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. చాంద్ బాషా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.
వైసీపీ ద్వారా రాజకీయాలోకి వచ్చిన అత్తార్ చాంద్ బాషా 2014లో కదిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పై 968 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2016లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ టీడీపీ..మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన వెంకట సిద్దారెడ్డి 27వేలకుపైగా ఓట్ల మెజార్టీతో వెంకట ప్రసాద్ పై విజయం సాధించారు.
జరగబోయే ఎన్నికల్లో వైసీపీ .. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సైదా రెడ్డిని పక్కన పెట్టి ముస్లిం మైనార్టీకి చెందిన బీఎస్ మఖ్ బూల్ అహ్మద్ కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ తరుపున చాంద్ బాషా పోటీ చేయాలని భావించారు. వైసీపీ ముస్లిం మైనార్టీ నేతకు అవకాశం ఇవ్వడంతో టీడీపీ తనకు అవకాశం ఇస్తుందని ఆశించారు. కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు వారికే అవకాశం కల్పిస్తూ వస్తుంటాయి.
అయితే టీడీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కే టికెట్ ఖరారు చేయడంతో చాంద్ బాషా అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, బహిరంగ సభకు సైతం సమాచారం ఇవ్వలేదన్న మనస్థాపంలో ఉన్న చాంద్ బాషా .. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా తొలిసారి అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్న చాంద్ బాషా ..కదిరిలో రేపు (సోమవారం) జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి (వైసీపీలోకి) చేరనున్నారు.
LK Advani: అద్వాణీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము