టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ అధికారులు ఊరట నిచ్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు విచారణకు రావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనకు 41 ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామకు నోటీసులు జారీ చేయడమే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులోని నిందితులతో రఘురామ ఫోటోలు బయటకు రావడంతో వారితో ఆయనకు ఏమైనా సంబంధాలు కొనసాగించారేమో అనుమానంతో విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లుగా భావించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు నోటీసులు రావడంపై రఘురామ విస్మయాన్ని వ్యక్తం చేశారు. నోటీసులు అందిన విషయాన్ని ఆయన దృవీకరించారు. అయితే ఈ రోజు విచారణకు ఎంపీ రఘురామ హజరు కావడం లేదు. విచారణకు ఈ రోజు హజరుకావాల్సిన అవసరం లేదంటూ సిట్ అధికారులు రఘురామకు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు మెయిల్ ద్వారా సిట్ సమాచారం పంపింది. అవసరమైతే మళ్లీ విచారణకు నోటీసులు జారీ చేస్తామని సిట్ ఆ మెయిల్ లో పేర్కొన్నట్లు తెలుస్తొంది.
ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడం, కేసులో నిందితుడుగా చేర్చడంతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా వచ్చే నెల 5వ తేదీ వరకూ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. మరో పక్క కేరళకు చెందిన ఎన్ డీ ఏ నేత తుషార్ ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు రిమాండ్ లోనే ఉన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేరళ హైకోర్టులో తుషార్ పిటీషన్