Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు శుక్రవారం వాడీ వేడిగా కొనసాగాయి. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించగా, ఈ సెక్షన్ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ స్కిల్ కేసు విచారణకు, ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ కూడా 17ఏ ను ఛాలెంజ్ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా, అవును 17ఏ ప్రతి చోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు.
సీఐడీ తరుపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ .. చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు ఉన్న చట్టమే వర్తిస్తుందని అన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని అన్నారు. “అసలు ఎంక్వయిరీ ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారు ? ఎంక్వయిరీ లేదా ఇంక్వయిరీ మీద నిరోధం ఉన్నప్పుడు పోలీస్ అధికారి కేసు పెట్టాలని ఎలా నిర్ణయిస్తారు ? పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారం లేనప్పుడు ఎలా కేసు నమోదు చేస్తారు ?” అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు.
దీనిపై సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ స్పందిస్తూ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని వాదించారు. తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. అనంతరం ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులోనూ 17ఏ వర్తిస్తుందని లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని తెలిపారు. ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరి కొంత మంది ప్రస్తావన లేదన్నారు.
కొందరికి ముందస్తు బెయిల్, మరి కొంత మందికి రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు మా క్లయింట్ కు బెయిల్ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గి ఈ పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ .. చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, కచ్చితంగా సెక్షన్ 17ఏ పాటించాల్సిందేనని అన్నారు. పిటిషనర్ చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో సోమవారం అరెస్టు చూపిస్తారని, అప్పుడు మంగళవారం ఈ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చినా ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేమనీ, సోమవారం వరకూ సీఐడీ అరెస్టు చేయకుండా ఉండగలదా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు.
సోమవారం వరకూ అరెస్టు అపమని జస్టిస్ త్రివేది ప్రభుత్వ న్యాయవాదితో అన్నారు. సోమవారం వరకూ అరెస్టు చేయబోమని కోర్టుకు చెప్పండని జస్టిస్ బోస్ అన్నారు. ధర్మాసనం ఆదేశాల ప్రకారం సోమవారం వరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ చెప్పగలనని సీఐడీ లాయర్ రోహత్గీ అన్నారు. కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకూ చంద్రబాబు ను అరెస్టు చేయబోమని సీఐడీ న్యాయవాది హామీ ఇచ్చారు.
Vijayasai Reddy: నెల్లూరు అసెంబ్లీ, పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధులపై కీలక ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి