TDP: తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ రకమైన ఓటమి ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలూ ఊహించలేదు. పరాజయం పాఠాల నుండి గుణ పాఠం నేర్చుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో జరిగిన తప్పులను ఈ సారి జరగకుండా చూసుకోవాలనుకుంటున్నారుట. రాబోయే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ పరిస్థితి. ఆ కారణంగా అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటి నుండి నియోజకవర్గ స్థాయి సమీక్షలు జరుపుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ బలమైన నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్నారుట. ఆయా నియోజకవర్గాలపై పార్టీ పరిస్థితిపై లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. మరో వైపు సర్వే నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి జనాల్లోకి పంపించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందట.
TDP: ముందుగానే అభ్యర్ధుల జాబితా సిద్దం
గతంలో చంద్రబాబు చివరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించే వారు కాదు. ఇన్ చార్జిలుగా ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వారిని రంగంలోకి దింపిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుండే అభ్యర్ధులను ప్రకటిస్తుండే వారు. అయితే ఇప్పుడు తన నూతన స్ట్రాటజీ ప్రకారం నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుపుతూ అభ్యర్ధుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. పార్టీ కోసం పని చేసే వాళ్లకే టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు, వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో పరాజయం పాలైన వాళ్లను, పలువురు సీనియర్ లను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటి వరకూ బహిర్గతం కాకపోయినా జనసేన, వామపక్షాల పొత్తుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అందుకోసం కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి. టీడీపీకి బలంగా ఉన్న 50 నుండి 70 నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ప్రకటించే విధంగా జాబితా సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది.
TDP: ప్రొద్దుటూరు ఇన్ చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డే
తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి చూచాయగా అభ్యర్ధిని ప్రకటించారని వార్తలు వినబడుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిలు రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలని లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు హితవు పలికిన చంద్రబాబు…సీనియర్ నాయకుల సూచనలు, సలహాలతో ముందుకు సాగాలని ప్రవీణ్ కుమార్ రెడ్డికి, వయసు విభేదాలను పక్కన పెట్టి జూనియర్ లకు సహకరించాలని లింగారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు ఇన్ చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డే కొనసాగుతారనీ, ప్రొద్దుటూరులో టీడీపీ స్థానాన్ని గెలిపించుకొస్తే లింగారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారని చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పరోక్షంగా ఎమ్మెల్యే టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డికేనని పార్టీ శ్రేణులకు అర్ధమయినట్లు అయ్యింది.
TDP: ఏడాది ముందుగానే..?
2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లింగారెడ్డికి 2014 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వరదరాజులు రెడ్డిపై వైసీపీ అభ్యర్ధి రాచమల్లు శివప్రసాదరెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున లింగారెడ్డి పోటీ చేయగా రెండవ సారీ రాచమల్లు శివప్రసాదరెడ్డి గెలిచారు. దీంతో అక్కడ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇదే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ అభ్యర్ధుల ఆర్ధిక పరిస్థితి. సామాజిక కోణంలోనూ పరిశీలనలు జరిపి అభ్యర్ధులను ముందుగానే ఖరారు చేయన్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఏడాది ముందుగానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించనున్నారని వార్తలు వెలువడుతుండటంతో నేతల్లో గుబులు రేగుతోంది.