ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకున్నాయి. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టగా సీటులోకి వెళ్లి కూర్చుంటే అవకాశం ఇస్తామని పలు మార్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ చెప్పినా సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, పయ్యావుల కేశవ్ తో సహా చాలా మంది టీడీపీకి చెందిన వారు రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేశారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేదీలతో సహా వివరించారు.
అధికార సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో పాటు స్పీకర్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై చర్యలు తీసుకోవాలని అధికార పక్ష సభ్యుడు డిమాండ్ చేశారు. బీఏసీలో సభ సజావుజా జరిగేందుకు సహకరిస్తామని పేర్కొని మరల చంద్రబాబు సూచనలతో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడం లేదనీ బుగ్గన పేర్కొంటూ.. టీడీపీ సభ్యులు బి అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గద్దే రామ్మెహన్, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయులు తదితరులను సభ నుండి సస్పెండ్ చేయాలని సభాపతికి సూచించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైరల్ కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా