TDP: టీడీపీ గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్నారా..? టీడీపీ క్రియాశీల రాజకీయాలకు దూరం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల పట్టాబి ఏపిసోడ్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యుడైన గల్లా జయదేవ్ హజరు కాలేదు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించలేదు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ గల్లా జయదేవ్ కనిపించలేదు. టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడులు చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షల విరమణ కార్యక్రమంలో ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పాల్గొనగా గల్లా జయదేవ్ మాత్రం గైర్హాజరు అయ్యారు.
TDP: ఇబ్బందులు ఎదుర్కొంటున్న గల్లా కుటుంబం
అయితే గల్లా జయదేవ్ ఉద్దేశపూర్వకంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమైన టీడీపీ నేతల టార్గెట్ గా చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భాగంగా గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఆ తరువాత కంపెనీ యాజమాన్యం కోర్టుకు ఆశ్రయించగా ఉపశమనం లభించింది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకూ గల్లా కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలకు, యాజమాన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీకి నోటీసులు, వారిపై కేసులు నమోదు కావడంతో 2024 ఎన్నికల్లో గుంటూరు నుండి పోటీ చేయకూడదనీ, టీడీపీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. గత నెలలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్ తో పాటు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 14 మందిపై భూ ఆక్రమణల కేసు నమోదు అయ్యింది.
Read More: Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల..!!
జయదేవ్ సహా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణల కేసు నమోదు
చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ లో వారిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణ కుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటి ల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీ కృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం ఆయన 2015 నుండి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో రెండు నెలల క్రితం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన చిత్తూరు నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు.. సదరు ట్రస్ట్ సంబందీకులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, రెడ్ విత్ 156(2) సీఆర్పిసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో గల్లా జయదేవ్ చేరనున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆయన నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జయదేవ్ పొలిటికల్ స్టాండ్ ఏమిటి అనేది వేచి చూడాలి.