TDP: తెలుగుదేశం పార్టీలో ఓ వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామని పలు సందర్భాల్లో నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తనతో సన్నిహితంగా కొనసాగుతున్న కొందరు నేతలకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ సర్వే నివేదికలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా గెలుపు గుర్రాలకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలు చంద్రబాబుతో చనువుగా వ్యవహరిస్తుండగా, కొందరు యువకులు లోకేష్ వర్గంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లోకేష్ కు టీమ్ ఉంది. దీంతో లోకేష్ సిఫార్సుతో సీట్లు తెచ్చుకోవచ్చు అనే ధీమాలో కొందరు నేతలు ఉన్నారు. అయితే అలాంటి వారిలో కొందరికి రాబిన్ శర్మ నివేదికలు షాక్ ఇస్తున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుండి పది ఎన్నికల్లో ఏడు సార్లు టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించగా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డే అయిదు సార్లు టీడీపీ తరపున గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గెలిచారు. టీడీపీ కంచుకోట లాంటి ఈ స్థానంలో దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 38వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ఓటమి పాలైయ్యారు.
ఈ పరిస్థితులను గమనించిన చంద్రబాబు .. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును పార్టీలో చేర్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ చార్జి గా ఉన్న సుధీర్ రెడ్డి అభ్యర్ధిత్వంపై రాబిన్ శర్మ టీమ్ కీలక రిపోర్టు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. బొజ్జల సుధీర్ రెడ్డికి జనంలో చెప్పుకోదగిన స్థాయిలో ఆదరణ లేదని రాబిన్ శర్మ టీమ్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తొంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారనీ, ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటూ వచ్చారని అంటున్నారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రి చేసిన సేవలు తనకు అనుకూలిస్తాయన్న ధీమాతో సుధీర్ రెడ్డి ఉన్నారని అంటున్నారు.
ఈ నాలుగేళ్లలో సుధీర్ రెడ్డి నెలలో పట్టుమని వారం రోజులు నియోజకవర్గంలో గడిపిన దాఖలాలు లేవని అంటున్నారు. కనీసం పార్టీ క్యాడర్ కు కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ ఉంది. ఇన్ చార్జిగా ఉన్న సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదని కొందరు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో కొద్ది నెలల క్రితం చంద్రబాబు పిలిపించి ప్రజల్లో ఉంటేనే సీటు ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో కొంత కాలంగా బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ క్యాడర్ మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు.
లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో సుధీర్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. సుధీర్ రెడ్డే అభ్యర్ధి అయితే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డికి కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తొంది. చంద్రబాబు చెప్పిన తర్వాత సుధీర్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నా ప్రజల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణలో లభించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సుధీర్ రెడ్డి అభ్యర్ధిత్వం ఖరారు చేయాలన్న పట్టుదలతో లోకేష్ ఉండగా, అక్కడ సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్ధి ఎంపిక చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.
Tirumala: 7న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు