Tirumala: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ నెల 7వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. టీటీడీ హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టనుంది.
గోశాలలోని గోసంపదను అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, గోమాతలకు భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల నమ్మకం. కావున టీటీడీ సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 7.30 గంటలకు వేద పఠనం, ఉదయం 7.30 గంటలకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీవేణుగోపాల స్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6 గంటలకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.