MLA Sitakka: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే దన్సారీ అనసూర్య అంటే చాలా మందికి తెలియదు కానీ సీతక్క అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఆమెకు ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమం నుండి బయటకు వచ్చిన అనంతరం న్యాయవాద వృత్తి చేపట్టిన సీతక్క .. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసినా తొలి సారి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సీతక్క నాటి టీఆర్ఎస్ అభ్యర్ధి చుందూలాల్ పై ఓటమి చెందారు.
ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చందులాల్ పై విజయం సాధించి రెండో సారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. సీతక్క డబ్బు, కాంట్రాక్టులు వంటి వాటిపై ఆశపడకుండా ప్రజల శ్రేయస్సే ప్రధమ లక్ష్యంగా పనులు చేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో ఆమె నియోజకవర్గంలో అందించిన సేవలతో దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అంతే కాకుండా వరదల సమయంలో ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి మరో సారి విజయం సాధించాలని సీతక్క భావిస్తుండగా, ములుగు నియోజకవర్గంలో ఎలాగైనా సీతక్కను ఓడించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. వ్యూహాత్మకంగా ఆమెకు పోటీగా బడే నాగజ్యోతి అనే మహిళా నేతను ప్రత్యర్ధిగా దింపారు. ప్రస్తుతం ములుగు జడ్పీటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగజ్యోతి నేరుగా దళంలో పని చేయకపోయినా ఆమె తల్లిదండ్రులు మాత్రం నక్సలైట్ ఉద్యమంలో పని చేశారు. దీంతో ఆమెకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన నాగజ్యతి 2019 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వతంతర్ అభ్యర్ధిగా పోటీ చేసి కాల్వపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత తడ్వాయి జడ్పీటీసీ గా ఎన్నికై ములుగు జడ్పీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జడ్పీ చైర్మన్ గా ఉన జగదీశ్ మరణంతో ఇన్ చార్జి చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమెకు కేసిఆర్ ములుగు అసెంబ్లీ అభ్యర్ధిగా తొలి జాబితాలోనే ప్రకటించారు.
నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న సీతక్కను ఎదుర్కొనేందుకు నాగజ్యోతి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ తనకు సంబంధించి ఆస్తులు, తన బయోడేటాను గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సానుభూతి పొందే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇదే సందర్భంలో సీతక్క స్పందిస్తూ సమాజంలో ఏవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని అంటున్నారు. తన నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ కేసిఆర్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారని, డబ్బుతో తనపై అభిమానాన్ని చూపుతున్న ప్రజలను కొనలేరని అంటున్నారు. తనకు నియోజకవర్గంలో ప్రజా బలం ఉందన్నారు. కరోనా సమయంలో గానీ, వరదల సమయంలో కానీ తన నియోజకవర్గ ప్రజల కోసం అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టి మరీ ఎంతో మంది మంత్రులను కలిశాననీ, కానీ ఏ ఒక్క మంత్రి తన నియోజకవర్గానికి వచ్చి చూసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తి అయిన పనులను వారి ఖాతాలో వేసుకుంటూ ఆగిపోయిన పనులకు మాత్రం తన అసమర్ధతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వీటిని ప్రజలు నమ్మరని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి వస్తున్న అధికార పార్టీ పెద్దలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మహిళా సెంటిమెంట్, ఉద్యమ నేపథ్యం ఉన్న సీతక్కను ఢీకొట్టేందుకు అదే ఫార్ములాతో బాడే నాగజ్యోతిని రంగంలోకి దింపిన కేసిఆర్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.