Telangana Congress: త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తొంది. బలమైన నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో మరల పోటీ చేయాలని తుమ్మల భావిస్తున్నారు. ఇటీవల తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు.. ప్రజల అభిమానం, ఆత్మీయత, ఆవేదన చూసిన తర్వాత ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తుమ్మల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట నడవడానికి అనుచరులు సిద్దంగా ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలా లేక ఏ పార్టీలో అయినా చేరాలా అనే దానిపై తుమ్మల ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో ఇవేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని వారు ఆయనను ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై తుమ్మల సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తొంది. తుమ్మల పార్టీలో చేరితే పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సముఖంగా ఉన్నట్లు సమాచారం.
తుమ్మల చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతోనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా అభిమానులు కల్గి ఉన్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ చేరితో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకుంటున్నారు.