YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ విలీన ప్రక్రియ త్వరలో జరగనున్నది. ఇప్పటికే ఓ పర్యాయం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల తాజాగా నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది. వాస్తవానికి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు.
ఏపితో పాటు తెలంగాణలోనూ వైఎస్ఆర్ ను అభిమానించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించడంతో ఆయనకు అండగా సోదరి షర్మిల నిలిచారు. జగన్ అరెస్టు అయిన తర్వాత షర్మిల పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణం అంటూ ప్రసంగాలు చేసి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న వైఎస్ షర్మిల .. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో క్రియాశీల భూమికను పోషించారు. జగన్మోహనరెడ్డి ఏపీ రాజకీయాలకే పరిమితం కావడంతో 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో కొందరు కాంగ్రెస్ వైపునకు, మరి కొందరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
అయితే ఏపీలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో, పార్టీలో షర్మిల ఆశించిన గౌరవం, గుర్తింపు లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల .. కేసిఆర్ సర్కార్ తీరుపై వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, పాదయాత్ర చేశారు. అయితే ఆశించిన మేర పార్టీ బలోపేతం కాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో షర్మిల పార్టీ మూలంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ వేగంగా అడుగులు వేసింది. వైఎస్ షర్మిల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగి షర్మిలతో చర్చలు జరిపారు. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు షర్మిలకు ప్రయోజనం కలిగేలా ప్రతిపాదనలు చేయడంతో ఆమె అంగీకరించారు.
అయితే తన రాజకీయం మొత్తం తెలంగాణ నుండే అని షర్మిల అనడంతో టీపీసీసీ నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కొందరు టీపీసీసీ నేతలు అధిష్టానానికి సూచించారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరికను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. షర్మిలకు మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రవేశించడం అంతగా సముఖత వ్యక్తం చేయడం లేదు. దాదాపు షర్మిల కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆమె సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలి సారిగా స్పందించారుట. ఆయన తన సన్నిహితుల వద్ద అది ఆమె ఇష్టం అన్నట్లుగా వ్యాఖ్యానించారని అంటున్నారు.
TDP: అతనికి టికెట్ ఇవ్వాల్సిందే అని బలవంతం చేస్తోన్న నారా లోకేష్, చంద్రబాబుకేమో అస్సలు ఇష్టం లేదు !