CM YS Jagan: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనలో పది మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. విశాఖ నుండి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం ఆలమండ – కంటకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై అగి ఉన్న సమయంలో అదే ట్రాక్ పై వెనుక నుండి వస్తున్న విశాఖ – రాయగడ రైలు .. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది.
ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు డీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మంత్రి బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైంది ప్యాసింజర్ రైతులు కావడంతో ప్రయాణీకుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టతరంగా మారింది.
కోల్ కతా – చెన్నై ప్రధాన మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేశారు. కోల్ కతా వైపు రైళ్లను విశాఖ తదితర స్టేషన్ లో నిలిపివేశారు. బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్ చేశారు. బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్ వివరించారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమీప ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయంగా ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారికి రూ.2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన ఇతర రాష్ట్రాల వారికి రూ.50 వేల చొప్పున సహాయం ప్రకటించారు సీఎం జగన్.