Vijayasai: ‘వదల బొమ్మాలీ .. నిన్నొదల’ అన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ నెల 1వ తేదీ నుండి క్రమం తప్పకుండా నిత్యం ఏదో ఒక అంశంతో పురందేశ్వరిపై ఫైర్ అవుతున్నారు విజయసాయిరెడ్డి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు.
మరో పక్క ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రులకు వరుస ఫిర్యాదులు చేయడం, చంద్రబాబు అరెస్టును ఖండించడం, లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు చేయించడంలోనూ పురందేశ్వరి పాత్ర ఉండటంతో వైసీపీ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తొంది. రీసెంట్ గా విజయసాయి రెడ్డి పై ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం పంపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. దీంతో విజయసాయి రెడ్డి వరుస ట్వీట్ లు చేస్తున్నారు.
తాజాగా పురందేశ్వరిని ఉద్దేశిస్తూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు విజయసాయి రెడ్డి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే అని పేర్కొన్నారు. పురందేశ్వరి అంతిమ లక్ష్యం కుల “ఉద్దారణే” అని మండిపడ్డారు. ఆమెకు స్వార్థం తప్ప, సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవని దుయ్యబట్టారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు.
మరో ట్వీట్ లో ఎన్టీఆర్ ను నిర్లక్ష్యం చేసిన విధానంపై విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. ‘ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి…పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా !’ అని రాసుకొచ్చారు విజయసాయి.