YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని వైఎస్ షర్మిల ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇటీవల నల్లగొండ జిల్లా ప్రతినిధులతో సమావేశమై బెంగళూరుకు వెళ్లిన షర్మిల నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. షర్మిల రాజకీయ పార్టీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా వేసుకుని బెంగళూరు వెళ్లడం, అక్కడ షర్మిలతో విజయమ్మ, భారతి భేటీ అయ్యారని వార్తలు రావడంతో రాష్ట్రంలో అనేక రకాలుగా ఊహాగానాలు సాగాయి.
రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో పునరాలోచన చేసుకోవాలని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి వస్తుందని అనుకున్నారు. అయితే ఈ ఊహాగానాలు పటాపంచలు చేస్తూ షర్మిల నేడు లోటస్ పాండ్ కు అడుగు పెట్టారు. ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలతో షర్మిల భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పర్యటన వాయిదా వేసుకున్న షర్మిల.. లోటస్ పాండ్ వేదికగానే వివిధ జిల్లాల నుండి నేతలను పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నేడు రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో భేటీ అనంతరం షర్మిల ఎలాంటి ప్రకటన చేయనున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.