YSRCP: సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతలు బాహాబాహీ దిగడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలోని పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. చైర్పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని పలు పనుల విషయాన్ని 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా లేవనెత్తారు. తన వార్డులో నీటి సమస్య ఉందని ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి సమాధానం చెప్పినా కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినలేదు.
ఈ సమయంలో మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్ ..బాషాకు సర్దిచెప్పాలని చూశారు. అనంతరం మాటమాటా పెరిగి ఒకరిపై ఒకరు చెప్పులు విసిరివేసుకుని దాడి చేసుకున్నారు. దీంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హాఠాత్మరిణామంతో ఇతర సభ్యులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్ మధ్య ఘర్షణ జరగడంతో పట్టణంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.