YSRCP: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకుల్లో అసంతృప్తులు పక్క చూపులు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న నేతలు పార్టీలను వీడుతున్నారు. రీసెంట్ గా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరేందుకు ఇవేళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
ఇదే క్రమంలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సంజీవ్ కుమార్ తెలిపారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కర్నూలు నుండి బళ్లారి వరకూ జాతీయ రహదారి సాధించాలన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పరిధిలో ఉన్నంత వరకూ తాను పని చేశానని చెప్పారు. వలసలు ఆగాలంటే పెద్ద స్థాయిలో నిర్ణయాలు జరగాలన్నారు. ఆపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావని అంటున్నారన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరో 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంటానని సంజీవ్ కుమార్ తెలిపారు.
సంజీవ్ కుమార్ గత ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఈ సారి ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే పార్టీ ఆయనకు ఎమ్మిగనూరు స్థానాన్ని ఇవ్వకపోగా, కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జిగా మంత్రి గుమ్మనూరు జయరాం ను నియమించారు. దీంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారు. దీంతో సంజీవ్ కుమార్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. కర్నూలు ప్రాంతంలో వైద్యుడుగా మంచి పేరు తెచ్చుకోవడంతో గత ఎన్నికల్లో జగన్ పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ జనసేన పార్టీలో చేరతానే ప్రచారం జరుగుతోంది.