YSRCP: అమెరికాలో నెలల తరబడి ఓ భారతీయ యువకుడిని తీవ్ర వేధింపులకు గురి చేసిన ముగ్గురు యువకులను అక్కడి పోలీసులు అరెస్టు చేసి బాధిత యువకుడిని రక్షించారు. అరెస్టు అయిన నిందితుల్లో ఒకరు ఏపీలోని అధికార వైసీపీకి చెందిన కీలక నేత కావడంతో ఈ వార్త తీవ్ర సంచలనం అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వైసీపీ నేత అరెస్టు వ్యవహారం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరాయి గడ్డపై తెలుగు వాళ్ల పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బాధిత యువకుడు ఏడు నెలల క్రితం మిస్సోరి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకునేందుకు వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సదరు విద్యార్ధి బంధువైన సత్తార్ వెంకటేష్ రెడ్డి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నుండి బలవంతంగా బాధితుడితో ఇంటి పనులు చేయించడం మొదలు పెట్టారు. ఉదయం 4.30 గంటలు మొదలు పెట్టి రాత్రి వరకు పని చేయాల్సి వచ్చేదని బాధితుడు తెలిపారు. సత్తార్ తన ఐటీ సంస్థతో పాటు అతనికి ఉన్న మూడు ఇళ్లలో కూడా పనులు చేయించే వాడు. గత ఏడు నెలలుగా ఒక బేస్ మెంట్ లో బంధించాడు. బాధితుడు అక్కడే కాంక్రీట్ ప్లోర్ పైనే నిద్రించాల్సి వచ్చేది. ఈ యువకుడిని సత్తార్ వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు యవకులు పీవీసీ పైపులతో శరీరకంగా హింసించినట్లు తెలుస్తొంది. 911కి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా పోలీసులు బుధవారం సత్తార్ వెంకటేష్ రెడ్డి ఇంటికి వెళ్లగా వారిని లోపలికి అనుమతించలేదు. అదే సమయంలో బేస్ మెంట్ నుండి బాధిత విద్యార్ధి పరిగెత్తుకుంటూ పోలీసుల వద్దకు వచ్చాడు. అప్పుడు అతని ఒంటిపై గాయాలతో ఉండటాన్ని గమనించిన పోలీసులు.. సత్తార్ వెంకటేష్ రెడ్డి తో పాటు అతని స్నేహితులు నిఖిల్ పెన్మత్స, శ్రవణ్ పెనుమచ్చలను అరెస్టు చేశారు.
తన స్టూడెంట్ వీసా కోసం సహకరిస్తున్నారని భావించానని, అయితే వారు తన పత్రాలను ధ్వంసం చేశారని ఆ విద్యార్ధి ఆరోపించాడు. సత్తార్ ధనవంతుడని, భారత్ లోని రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు చెప్పాడు. అతను ఒక రింగ్ లీడర్ అని పోలీసులు గుర్తించారు. సత్తార్ వెంకటేష్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఇద్దరిని నాన్ బెయిలబుల్ వారంట్ పై అరెస్టు చేసిన పోలీసులు.. మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సత్తార్ వెంకటేష్ రెడ్డి వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ గా, ఆ పార్టీ ముఖ్య నేతలతో దిగిన ఫోటోలు అతని సోషల్ మీడియా ఖాతాలో దర్శనమిచ్చాయి.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారన్నారు. ఏపీలో అయితే బాధిత యువకుడిపైనే రివర్స్ కేసు పెట్టి, సీఐడీతో దర్యాప్తు చేయించేవారని అన్నారు. అమెరికా ప్రభుత్వం ముందు వైకాపా సైకోల ఆటలు సాగలేదని, చట్టానికి పిల్ల సైకోలు చిక్కారని వ్యాఖ్యానించారు నారా లోకేష్. కాగా, ఈ కేసులో అరెస్టు అయిన వెంకటేష్ రెడ్డి ఏపీ ప్రభుత్వ న్యాయశాఖలోని కీలక అధికారి బంధువు అని ప్రచారం జరుగుతోంది.
YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కరరెడ్డి .. తిరిగి చంచల్ గూడ జైల్ కు తరలింపు