YSRCP: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 30 నెలలు దాటింది. ఇప్పటి వరకూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రక్షాళనకు వైఎస్ జగన్ సన్నద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రక్షాళన అంటే మంత్రివర్గ పునర్వవస్థీకరణ, కీలక అధికారుల మార్పులు, చేర్పులు. పార్టీ ప్రక్షాళన అంటే సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలతో పార్టీ కమిటీల ఏర్పాటు. త్వరలో మంత్రి వర్గపునర్వస్థీకరణ చేయడానికి జగన్ సన్నద్దం అవుతున్నారు. మరో పక్క ఇటీవలే కీలక అధికారుల మార్పులు జరిగాయి. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించడం, అదే విధంగా సీఎంఓలో ఉన్న కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీ ఏపి భవన్ కు పంపి ఆయన స్థానంలో టీటీడీ ఇఓ జవహర్ రెడ్డిని సీఎంఓలోకి తీసుకున్నారు.
YSRCP: విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యతలు
ఇదే క్రమంలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యతలను అప్పగించారు. పార్టీ అనుబంధ సంఘాలకు ఇన్ చార్జి గా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూనే మొన్నటి వరకూ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుండి ఆయనను తప్పించడంతో విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గింది అంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు జగన్ అంతకన్నా పెద్ద బాధ్యతలనే అప్పగించారు. విజయసాయి వ్యతిరేకులు ఈ చర్యలపైనా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవీ కాలం ముగినుంది. మరో సారి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ రెన్యువల్ చేయడం ఖాయమని వార్తలు వినబడుతున్న తరణంలో పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించడం రాజ్యసభ రెన్యువల్ లేనట్టేనని ప్రచారం చేస్తున్నారు.
రాజ్యసభ రెన్యువల్..?
జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నాలుగు పదవులకు వైసీపీలో తీవ్రమైన పోటీయే ఉంది. సీఎం వైఎస్ జగన్ ఎవరిని అవకాశం కల్పిస్తారనేది ఎవరి ఊహలకు, అంచనాలకు అందదు. ఒక రాజ్యసభ స్థానం మాత్రం కేంద్రంలోని బీజేపీ సీఫార్సు చేసే అదానీ లాంటి కార్పోరేట్ శక్తికి ఖాయమనే మాట వినబడుతోంది. ఇక మూడు రాజ్యసభ స్థానాలకు జగన్ ఎవరిని ఎంపిక చేయనున్నారో వేచి చూడాలి. విజయసాయిరెడ్డిని పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తే మాత్రం రాజ్యసభకు రెన్యువల్ ఉండదని అంటున్నారు.
రాజ్యసభ అభ్యర్ధిత్వాలపై త్వరలో క్లారిటీ
గతంలోనూ విజయసాయి రెడ్డి పై రకరకాల ఊహగానాలు వచ్చిన సందర్భంలోనూ పార్టీ అధినేత ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్వర్ధించడమే తన కర్తవ్యమని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక్కటే యాక్టివ్ గా ఉండగా, ఇతర పార్టీ అనుబంధ సంఘాలు అంతగా యాక్టివ్ గా లేవు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న కారణంగా అన్ని అనుబంధ సంఘాలను యాక్టివ్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారని వార్తలు వినబడుతున్నాయి. రాజ్యసభ అభ్యర్ధిత్వాలపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.