హైదరాబాద్ లో కరోనా కోరలు చాచింది. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో స్పెయిన్, ఇటలీ, అమెరికా దేశాల్లో ఎంత బీభత్సంగా కరోనా వ్యాపించిందో ప్రస్తుతం హైదరాబాదులో అదే పరిస్థితి ఉంది. పరీక్షలు అతి తక్కువగా పాజిటివ్స్ మాత్రం ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ రోజుకు 10 లక్షల పరీక్షలు జరిగితే హైదరాబాద్ లో కనీసం రెండు నుంచి మూడు లక్షలు పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉంది. అంటే దేశంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్న నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. కానీ కరోనా పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో సాధారణ జనాల నుంచి విఐపిల వరకు అడుగడుగునా అభద్రతా భావానికి, భయానికి గురి అవుతున్నారు.బయట తిరగడానికి భయపడుతూనే స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది భగవంతునిపై భారం వేస్తూ ఎవరి బతుకులు వాళ్లు చూసుకుంటున్నారు.
కరోనా నియంత్రణపై ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రులపై భారం వేశారు. ముఖ్య మంత్రులు కలెక్టర్ లపై భారం వేశారు. కలెక్టర్లు తహసీల్దార్లుపై భారాలు వేశారు. తాసిల్దార్ లు ప్రజల నెత్తిన భారం వేశారు. ప్రజలు భగవంతునిపై భారం వేస్తూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. విచ్చలవిడిగా
తిరుగుతున్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉండగా హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అందుకే పాజిటివిటి రేటు 25 శాతానికి చేరుకుంది. ఇప్పట్లో నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
హైదరాబాద్ లో పేరుమోసిన ఆసుపత్రులు నిమ్స్, టిమ్స్, కేర్ ఆస్పత్రి, యశోద, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి ఆసుపత్రులు ఉన్నప్పటికీ బెడ్లు సరిపోవడం లేదు. బెడ్ లు చాలక, వెంటిలేటర్ లు ఆసుపత్రుల బయట, వరండాలలోను కొంత చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెంటిలేషన్ అందక, ఆక్సీజన్ అందక మరణాలు ఎన్ని జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాదులో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అని ఒక్కసారి చూస్తే..
తెలంగాణలో మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 15 మధ్యలో కరోనా అదుపులో ఉన్నట్లే కనిపించింది. హైదరాబాద్ లో వంద కేసులకు మించి లేవు. ఆ సమయంలో పాతబస్తీకి అనేక మంది విదేశాల నుంచి తిరిగి రావడం, ఢిల్లీ జమాత్ కు వెళ్లి తిరిగి రావడం, వారి నుంచి వివిధ జిల్లాలకు వెళ్లి రావడం జరిగింది. అయితే అప్పటికి లాక్ డౌన్ అమలులో ఉండటంతో పెద్దగా వ్యాప్తి జరగలేదు.కానీ మే 15 తరువాత లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లో విచ్చలవిడి జీవనం ఆరంభమైంది. ముఖ్యంగా కోటి, చార్మినార్ పాతబస్తీ అబిడ్స్ వంటి ప్రాంతాల్లో సామాజిక దూరం, మాస్క్ లు అనే కనీస బాధ్యతలు లేకుండా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో విపరీతంగా జనసంచారం జరిగింది. ఆ సమయంలోనే వైరస్ విస్తృతంగా వ్యాపించింది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక పాజిటివ్ ఉన్న పేషెంట్ నుంచి లాక్ డౌన్ సమయంలో అయితే ఇద్దరు లేదా ముగ్గురుకి కరోనా వస్తే లాక్ డౌన్ లేని సందర్భంలో ఒక పేషెంట్ నుంచి 400 మందికి వ్యాపించే అవకాశం ఉంది. తెలంగాణలో అదే జరిగింది. హైదరాబాద్ లో అచ్చంగా అదే జరిగింది. లాక్ డౌన్ అమలులో లేకపోవడంతో పాజిటివ్ ఎవరికి ఉంది, కరోనా ఎవరికుందో తేల్చక, పరీక్షలు జరగక విచ్చలవిడిగా తిరిగేయడంతో లక్షణాలు కనిపించిన వారే ఇళ్లకు పరిమితమవుతున్నారు. లక్షణాలు కనిపించని వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లోపల వైరస్ ఉందని గుర్తించక జనసంచారంలో తిరుగుతూ ఉండటంతో జూన్ 15 నాటికి తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పటి నుండి పరీక్షల విషయంలో ఆరోపణలు విమర్శలు వస్తున్నా రోజు అరకొరగా రెండు వేలు, మూడు వేలు టెస్ట్ లు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూడా తెలంగాణ లో సగటున 5వేల నుండి 6వేల టెస్ట్ లు మాత్రమే జరుగుతున్నాయి. వీటిలో సగటున 1500 నుంచి 2వేలు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర స్థాయిలో రోజుకి 40వేలు లేదా 50వేల పరీక్షలు జరిపితే తెలంగాణలో రోజు కనీసం 10వేల నుండి 15వేల కేసులు నమోదు అవుతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఇండియా లోనే ఒక రకంగా ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదయిన నగరంగా హైదరాబాద్ చరిత్ర పుటల్లో నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ భయాలు అన్ని గమనించిన హైదరాబాదు వాసులు, వలస జీవులు ఏపీ లోని తమ ప్రాంతాలకు పయనం అవుతూ సరిహద్దులో ఇరుక్కుపోతున్నారు.