కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఏమో కానీ ప్రపంచాన్ని మొత్తం గడగడ లాడిస్తున్నది. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసింది. లాక్ డౌన్ సడలింపుల పర్వం ప్రారంభం కాక ముందు వరకు నగరాలు, పట్టణాలకు పరిమితం అయిన కరోనా కేసుల ఉధృతి ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే కరోనా అంటే ప్రతి ఒక్కరికి ఆందోళన భయం కల్గిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా పాలక పక్షాలకు మాత్రం మేలే చేస్తున్నది.
కరోనా ఏమిటి, పాలక పక్షాలకు ఎలా మేలు చేస్తుంది అనుకుంటున్నారా? ఇది అక్షరాల నిజం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గత ఆరు ఏడు నెలలుగా ఎక్కడైనా ఆందోళనలు జరిగాయా?. అంటే లేదు. ప్రజలు అందరూ ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నారా?. అంటే అదీ లేదు ప్రజలకు సమస్యలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో భారీగా మద్యం ధరలు పెంచినా, విద్యుత్ చార్జీలు పెరిగినా, పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నా వీటిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా వామపక్షాలు ప్రజల పక్షాన రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి లేదు. కరోనా కాలం కాకపోయి ఉంటే మూడు రాజధానుల సమస్యపై వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ ఆందోళనలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో జరిగేవి.
* కరోనా లాక్ డౌన్ సడలింపుల తరువాత పెట్రోల్ రోజు ఒక రూపాయి చొప్పున పెరుగుతూ వచ్చింది. లీటరు 75రూపాయలు ఉన్న పెట్రోల్ నేడు 86 రూపాయల వరకు చేరింది. నిజానికి కరోనా కాలం కాకపోయి ఉంటే ప్రతి పక్షాలు వామపక్ష నాయకులు, కాంగ్రెస్ నేతలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. కానీ అప్పుడు అది కనిపించలేదు.
*కరోనా లాక్ డౌన్ సమయంలో నే విద్యుత్ చార్జీల స్లాబ్ రేట్ లను మార్చారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అందరూ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇళ్లకే పరిమితం కావడం, టీవీ లకు ముందే కూర్చోవడంతో విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని వామపక్షాలు పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయే తప్ప ప్రత్యక్ష ఆందోళనకు దిగలేక పోయారు.
* లాక్ డౌన్ నిబంధనలు సడలించిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం రేట్లను అమాంతం పెంచేసింది. మునుపెన్నడూ లేని విధంగా మద్యం ధరలను 75శాతం పెంపు చేసింది. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా మందు బాబుల కోసం రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయలేదు.
*మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు కరోనా లాక్ డౌన్ కు ముందు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. వీరి ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కరోనా నేపథ్యంలో వారి నిరసనలు ఇళ్లకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక మీడియాకే ఈ వార్తలు పరిమితం అయ్యాయి. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించినా సరే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన తీవ్రతరం చేయలేకపోయారు.
* ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఫిబ్రవరి నెలలో ప్రకాశం జిల్లా మార్టూరు నుండి జనచైతన్య యాత్ర ప్రారంభించారు. నిజానికి టీడీపీ ఆ యాత్రను మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో పూర్తి చేయాలనుకున్నది. కానీ కరోనా నేపథ్యంలో ఆ యాత్రకు బ్రేక్ పడింది. ఈ విషయాన్ని పక్కన పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు ఎక్కడా రోడ్డు ఎక్కడం లేదు. ఆందోళనలు చేయడం లేదు. నిజానికి వారు ఆందోళన చేయదల్చుకుంటే ఒక్క రాజధాని సమస్యే కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం కావచ్చు, చీరాలలో దళిత యువకుడు కిరణ్ మృతి కేసు కావచ్చు, తాజాగా శిరోముండనం కేసు కావచ్చు ఇలా అనేక అంశాలపై మాములు రోజుల్లో అయితే ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేది.
పత్రికా ప్రకటలకే పరిమితం
ప్రభుత్వ విధానాలపై వివిధ రాజకీయ పక్షాల నేతలు మీడియా సమావేశాలలో మాట్లాడటం లేకపోతే పత్రికా ప్రకటనలు విడుదల చేయడం తప్ప చేసేది ఏమిలేదు. వివిధ జిల్లాల్లో కరోనా కేసులు అధికారం అవుతుండటంతో ప్రాంతాల వారీగా మళ్ళీ లాక్ డౌన్ లను అమలు చేస్తున్నారు. దీనితో ఏ సమస్య పైనా రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి లేదు. కరోనా వచ్చి ప్రతిపక్షాల కాళ్ళు, చేతులు కట్టేసినట్లు అయింది. ఎప్పుడు ఎదో ఒక సమస్యఫై ఆందోళనలు చేసే వామపక్షాలకు పూర్తిగా పని లేకుండా చేసింది కరోనా. అందుకే అనుకోవచ్చు కరోనా పాలకులకు వరం, ప్రతిపక్షాలకు శాపం.