రాష్ట్రంలో సంచలనంగా మారి ఎటూ తేలని హత్య కేసులు చాలానే ఉన్నాయి…! దశాబ్దం కిందట జరిగిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు, మూడేళ్ళ కిందట జరిగిన సుగాలి ప్రీతీ హత్య కేసు… గత ఏడాది జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు… ఇవన్నీ సంచలనాలే. మొదటి రెండు యువతులపై అత్యాచారం నేపథ్యంలో జరిగితే… మూడో హత్య మాత్రం రాజకీయం, వారసత్వం, పంచాయతీలు ఇలా అనేక కోణాల్లో జరిగింది. ఏది స్పష్టమైన కారణం తెలియదు. అది తేల్చడానికే సిబిఐ రంగంలోకి దిగింది. కానీ సిబిఐ చుట్టూ అనేక చిక్కుముళ్ళు….! నిర్ధారించాల్సిన నిజాలున్నాయి.., తీర్చాల్సిన అనుమానాలున్నాయి…, చూడాల్సిన కోణాలున్నాయి…! ఇలా అనేక అంశాలు చుట్టూ ఈ దర్యాప్తు సాగాల్సి ఉంది.
సాధారణంగా హత్యలకు కారణాలు రెండే : ఒకటి డబ్బు, రెండోది అక్రమ సంబంధాలు. ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో ఆచూకీ చిక్కకపోతే ఇక సీరియస్ కారణాల అన్వేషణలో పోలీసులకు చుక్కలు కనిపిస్తాయి. గత ఏడాది రాష్ట్రాన్ని కుదిపేసిన, పొలీసు వ్యవస్థకి సవాలుగా మారిన… వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై నిజాలు నేటికీ వెల్లడి కావడం లేదు.
అనేక అనుమానాలున్నాయి. రాజకీయంగా తన స్థానానికి పోటీ వస్తున్నారని ఆ బంధువు చంపించారా? క్వారీ లావాదేల్లో తనకు అడ్డు వస్తున్నారని మరో బంధువు చంపించారా? గొడవల్లో పంచాయతీలు చేస్తున్నారని దగ్గరి వాళ్ళు చంపించారా..?? అసలు ఆ నేతను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది? ఇది జరిగి పదిహేను నెలలు గడిచింది. ఇప్పటికీ వెనుకున్నది ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రదారులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రావడం లేదు. వివేకా హత్య కేసులో రాజకీయం, ఆస్తి, కుటుంబ వైరి ప్రధాన భూమిక పోషించాయనేది అక్కడ వినిపిస్తున్న మాటలు. వివేకాకు శత్రువులు ఎవరూ లేరు. ఆయన శైలి వివాదరహితం. నెమ్మదస్తుడు. రాజకీయంలో కూడా పెద్దగా ఎదగకుండా అన్న చాటున తమ్ముడిగా ఉండిపోయారు. ఎన్నికలకు నెలరోజుల ముందు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత క్రూరంగా ఫ్యాక్షన్ సినిమాల్లో చంపినట్టుగా ఆయనను కిరాతకులు నరికి చంపారు.
నాడు కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలు…!!!
నాడు పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ విచారణ కోరారు. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించారు. ఈ అనుమానాలకు అనుగుణంగా ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సునీత అనుమానాలు, సగటున ప్రతి మనిషికీ వచ్చే అనుమానాలే. అవేంటో ఒక్కసారి చూద్దాం…!
* నైట్ వాచ్ మెన్ రంగనకి తెలియకుండా ఇంటిలోపలికి హంతకులు ప్రవేశించే వీలుందా? ఉదయం చాల సమయం వరకు రంగన్న ఫోన్ ఎందుకు అందుబాటులో లేదు? దీనిపై పోలీసులు ఎందుకు ఇప్పటికీ పురోగతి సాధించలేదు?
* వివేకా మృతదేహంపై గాయాలు బహిర్గతమయ్యేవరకు గుండెపోటు అని ఎందుకు చెప్పారు?
* పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, గాయాలను చూసి కూడా ఉదయం 9 గంటల సమయంలో అనుమానాస్పద మృతి అని కేసు నమోదు చేసారు. శరీరంపై అన్ని రక్తపు గాయాలున్నా అనుమానాస్పద మృతి అవుతుందా?
* కేసు నమోదు చేయవద్దంటూ యెర్ర గంగిరెడ్డి ఒత్తిళ్లు ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో పని చేసే లక్ష్మమ్మని ఆ రక్తపు మేరకు తుడిసివెయమని గంగిరెడ్డి ఎందుకు చెప్పారు?
* డాక్టర్ శివశంకరెడ్డి వివేకా చనిపోయిన రూమ్ కి వెళ్లి మృతదేహంపై గాయాలని మాయం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు?
* సిట్ లో అధికారులని ఇప్పటి వరకు మూడు సార్లు ఎందుకు మార్చారు? డిజి స్థాయి సిట్ అధికారి నుండి ఎస్పీ స్థాయికి ఎందుకు మార్చారు?
* పోలీసులు అసలు అనుమానితుల కాల్ డేటా పరిశీలించారా?
* ప్రధాన అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి హత్య జరిగిన రోజునే ఆసుపత్రిలో ఎందుకు చేరారు? తరువాతి రోజు హరిత హోటల్ లో టిడిఫై ఎమ్మెల్సీ బిటెక్ రవిని ఎందుకు కలిశారు?
ఈ ప్రశ్నలు, అనుమానాలు వివరిస్తూ సునీత ఈ కేసుని సిబిఐ కి అప్పగించాలని హైకోర్టుని ఆశ్రయించారు. తనతో పాటూ తన భర్తకి కూడా వివేకా హత్య సూత్రధారులు నుండి ప్రాణహాని ఉందంటూ కోర్టుకి తెలియజేసారు.
సొంత వారిపైనే అనుమానాలు…!!
వివేకా హత్య విషయంలో పరాయి వాళ్ళ కంటే కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాకు బయట శత్రువులు ఎవరూ లేరు. సునీత ఇచ్చిన 14 అనుమానితుల పేర్లులోను 10 మంది వైఎస్ బంధువర్గం, కుటుంబ సభ్యులే ఉన్నారు. పులివెందులలో జరుగుతున్నప్రచారం, ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లు చూసినా ప్రజాప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉందని వెల్లడవుతుంది. పులివెందులలో ప్రస్తుతం వైఎస్ కుటుంబాలన్నీఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ… వారికి పూర్వం నుండి చిన్నపాటి తగాదాలున్నాయి. అలా వైఎస్ కుటుంబంలో నాటి నుండీ బయటకు పొక్కని విభేదాలుండేవి. మొత్తానికి వైఎస్ కుటుంబంలోని ఒక నాయకుడి హత్య కేసు అదే కుటుంబంలోని వ్యక్తులను చుడుతోంది. దీనిలో నిజానిజాలు తేలిన తర్వాత కచ్చితంగా రాష్ట్రంలో సంచలన అంశంగా మారుతుంది.