అటవీ హక్కు దరఖాస్తులు “తిరస్కారానికి” గురి అయిన దరఖాస్తుదారుల మీద చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు భారతదేశపు అటవీ పరిపాలనకి సంబంధించి చాలాకాలంగా కొనసాగుతున్న సైద్ధాంతిక వివాదాలకి మళ్ళీ ఆజ్యం పోసింది. అటవీ హక్కుల చట్టం,2006 రాజ్యబద్ధతని ప్రశ్నిస్తూ వైల్డ్ లైఫ్ ఫస్ట్&ఇతరులు (WP (C) 50/2008) దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుకి వచ్చిన ప్రతిస్పందన రెండు క్యాంపులుగా విడిపోయింది. ఒకటి ఉన్నతవర్గ (elite) ప్రకృతి పరిరక్షకుల వర్గం. మరొకటి ఆదివాసి, అటవీ నివాసితుల హక్కుల వర్గం.
ఈ ఉత్తర్వు పదకొండు సంవత్సరాల క్రిందట దాఖలు చేసిన కేసుకి సంబంధించింది. ఈ ఉత్తర్వులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే తిరస్కారానికి గురయ్యిన దరఖాస్తుదారుల విషయంలో తొలగింపు చర్యలు మొదలుపెట్టాలని, అలాగే ఏమి చర్యలు తీసుకున్నారు అనే నివేదికలు కోర్టుకి సమర్పించాలని.
సాక్ష్యాలు లేకపోవటం, పరిపాలన పరిమితుల కారణంగా దరఖాస్తుల పరీక్ష ప్రక్రియ చాలా అధ్వానంగా ఉందని పేర్కొంటూ తొలగింపుని ఆపమని రెండు వారాల తరువాత కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని కోరాయి. తరువాత ఇచ్చిన ఫిబ్రవరి 28 నాటి ఉత్తర్వు ప్రకారం దరఖాస్తుల తిరస్కరణ ఎందుకు, ఏ విధంగా జరిగాయో తెలపాలనీ, తొలగింపు ఆదేశాలు “అసంపూర్ణ సమాచారం” ఆధారంగా జారీ చేశారేమో తెలపాలనీ సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని ఆదేశించింది.
ఇప్పటికైతే ఈ కేసు ప్రధానంగా అటవీ హక్కుల చట్టం అమలులో ఉన్న సవాళ్ల గురించి కాగా ఇప్పుడు మాత్రం అటవీ పరిపాలనకి సంబంధించి అనేక క్లిష్టమైన అంశాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకి తీసుకువస్తున్నది. అనేక కారణాల వల్ల సంక్లిష్టంగా మారిన ఏదైనా ఒక గందరగోళంతో కూడిన విషయాన్ని పరిష్కరించే శక్తి వ్యవస్థాగతంగా కోర్టులకు ఉండదు. అనేక కారణాల వల్ల ఈ కేసులో అంతిమ తీర్పు ఇరువర్గాలలో ఏ వర్గానికి సహాయకారిగా ఉండకపోవచ్చు. అందులో మూడు కారణాలని కింద విశదీకరించాము.
మొదటగా అటవీ హక్కుల చట్టం చేయగల పని నిర్వచనాన్ని అధికారులు దరఖాస్తులు నింపటం, దరఖాస్తులు సమర్పించటం, పట్టాలు పుచ్చుకోవటం అనే హక్కుల సెటిల్మెంట్లకు పరిమితం చేశారు. ప్రభుత్వాలన్నీ కూడా ఇదే అవగాహనని ప్రోత్సహించాయి, అలాగే కోర్టు కూడా ఈ విషయం వరకే తన పరిధిని పరిమితం చేసుకుంది. అదే అటవీ హక్కుల చట్టం రూపకల్పన చూస్తే ఈ చట్టం ఇంతకముందే ఉన్న హక్కులని గుర్తిస్తుంది, అలాగే వికేంద్రికృత, సమూహం ఆధారిత అటవీ పరిపాలనకి అవకాశం కల్పిస్తుంది.
ఈ పరిపాలన మోడల్ రెండు రకాలుగా ఉండవచ్చు. అయితే కేవలం హక్కుదారుల నిర్ణయ విధానం ప్రకారం, లేదా విభిన్న భాగస్వామ్య పద్దతుల ద్వారా ఇది ఉండవచ్చు. అటవీ సంపద వాణిజ్య వినియోగం దగ్గర నుండి అటవీ సంరక్షణ వరకు ఈ భాగస్వామ్య పద్దతులు వైవిధ్యమైన ఫలితాలకి దారి తీయవచ్చు. వన్యప్రాణుల సంరక్షణ కొరకు ఎటువంటి మానవ ప్రభావం లేని ప్రాంతాలు ఏర్పరిచే అవకాశాన్ని ఇది ముందే మూసేయదు.
రెండవ కారణం ఇండియా లాంటి దేశంలో చట్టాల అమలును ప్రభావితం చేసే రాజకీయ ఆర్ధిక అంశాలు. పర్యావరణానికీ, హక్కుల పరిరక్షణకూ సంబంధించిన చట్టాలు ఇండియాలో చాలావరకు దుర్వినియోగం అయ్యేందుకు ఆస్కారం ఉంది. అందువలన వాస్తవమైన హక్కులు తిరస్కారానికి గురవుతున్నాయి అనేది ఎంత ఆమోదయోగ్యంగా ఉందో అడవులని “ఆక్రమించటానికి” బూటకపు దరఖాస్తులు సమర్పిస్తున్నారు అన్న పిటీషనర్ వాదన కూడా అంతే ఆమోదయోగ్యంగా ఉంది. ఈ రెండు దుర్వినియోగాలూ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. ఈ దుర్వినియోగాలకు అటవీ వ్యవహారాలు, ఆదివాసి వ్యవహారాలు, రెవిన్యూ వ్యవహారాలు చూసే అవినీతి అధికారుల మద్దతు కావాలి.
ఈ కేసుల్లో ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా ఏమి జరుగుతుంది అనేది తెలుసుకోవటం చాలా అవసరం. కానీ ఇప్పుడు ఇది అత్యున్నత న్యాయస్థానం ముందు ఉండటం వల్ల నిజమైన బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలకి దారితీసే అంశాలు బయటకి రాకపోవచ్చు. అయితే ఈ దుర్వినియోగ ఉదంతాలు అటవీ, వన్యప్రాణి సంరక్షణ, ఆదివాసి అటవీ నివాసితుల హక్కులు అనే న్యాయమైన లక్ష్యాల మీద ప్రభావం చూపించకూడదు.
ప్రతి దరఖాస్తుకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అధికారువరో బయటపెట్టకుండా తొలగింపు ఆదేశాలు ఇవ్వటం అంటే న్యాయాన్ని తుంగలో తొక్కటమే. అటవీ పరిపాలనలో సమూల వ్యవస్థాగత మార్పులకి ఉన్న అవకాశాలను కూడా కూడా అది దెబ్బ తీస్తుంది.
మూడవది ఏమిటంటే ఈ కోర్టు కేసుకి సంబంధించిన చర్చ రెండు పరస్పర వ్యతిరేక ధ్రువాల వారగా సాగుతున్నది. అయితే అటవీ హక్కుల చట్టం పరిధిలో వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారికీ, అటవీ నివాసితుల హక్కులకు ప్రాధాన్యత ఇచ్చేవారికీ కొన్ని ఉమ్మడి ఆందోళనలు ఉన్నాయి. ఈ చట్టం అమలులో జరుగుతున్న వక్రీకరణ, అటవీ జీవావరణాల సంరక్షణ, మనిషి-వన్యప్రాణి సంఘర్షణ, ఖనిజ సంపద వెలికితీత ప్రాజెక్టులని వ్యతిరేకించగల సమూహాల సామర్ధ్యం, సామూహిక అటవీ హక్కుల గురించి పట్టించుకోకపోవడం అందులో మచ్చుకు కొన్ని.
వాతావరణ మార్పుకు, మనుషుల, జంతువుల వలసకు దారి తీస్తున్న శక్తులు ఇంతకు ముందు లేని విధంగా ఈ సవాళ్లని ఇంకా జటిలం చేస్తున్నసంగతి గుర్తిస్తే ఈ ఉమ్మడి ఆందోళనల పరిధి ఇంకా పెరుగుతుంది. సుందర్బన్ ప్రాంతంలోని పెద్దపులి గతి, అక్కడి మనుషుల వలసలు వాతావరణం మార్పుల వల్ల జరిగే విధ్వంసంతో ముడిపడి ఉన్నాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకార ఆసియా ఏనుగులు, పెద్దపులుల వంటి జంతువులు కొత్త ఆవాస ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. అందులో మనుషుల నివాసస్థలాలు కూడా ఉన్నాయి.
భూమి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల రీత్యా ఈ విషయంలో వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ కేసులోని ఇరు వర్గాలలో ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఏకపక్ష ధోరణుల ద్వార ఈ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు.
ఈనాటి పరిస్థితుల్లో అటవీ నివాసితులకి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థాగత అన్యాయాన్ని రూపుమాపటం, మానవేతర జీవులని సంరక్షించడం రెండూ అత్యావశ్యకం. కానీ క్షేత్ర స్థాయిలో ఈ లక్ష్యాలని చేరుకోవాలంటే సృజనాత్మక, పరస్పర సహకార ధోరణి అవసరమవుతుంది కానీ అటవీ హక్కుల చట్టంపై సంకుచిత కోర్టు వ్యాజ్యాలు కాదు.
కంచి కోహ్లీ, మంజు మీనన్
కంచి కోహ్లీ, మంజు మీనన్ న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలిసీ రీసెర్చ్లో పరిశోధకులు
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో