రాష్ట్రంలో రాజకీయం పీక్స్ లో ఉంది. వారానికొక కొత్త అంశం తెరమీదకు వస్తూ సరి కొత్త వివాదాలకు దారితీస్తోంది. టిడిపి, వైసిపి మధ్య, వారి వారి అనుకూల మీడియాల మధ్య నువ్వా నేనా అనుకునేంతగా పోరాటం జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యంగ్యాలు అన్నీ తోడవుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓ కొత్త సంచలనమైన అంశం తెర మీదకు వచ్చింది.. ఇంతకీ ఏమిటా అంశం అని చూస్తే…
న్యాయవ్యవస్థపై నిఘాతో ఏబీఎన్ ఆర్కే సంచలనం.. ఓకే
రాష్ట్రంలోని న్యాయమూర్తుల ఫోన్ లు ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది.వాళ్ళ ప్రతి వాట్సాప్ మెసేజ్ ను కూడా ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ పెద్దలు కొంత మంది ఇదే పనిలో ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నిఘా పెట్టింది. జడ్జీల ప్రతి కదలిక, ప్రతి సందేశం, ప్రతి మాట కూడా ప్రభుత్వ కనుసన్నల్లో ఉంచుకొంటోంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న ఒక సంచలన కథనం రాసింది. అయితే కధనం అంతా ఊహాతీతంగా, వేకుగా ఉంది. ఎటువంటి ఆధారాలను చూపించలేదు. కేవలం ఒక ఉదాహరణ పేర్కొంటూ మాత్రమే కథనాన్ని వండి వార్చింది. అయితే కధనంలో ఆధారం, ఉదాహరణలు ఎంత బలహీనంగా ఉన్నా అంశం మాత్రం సంచలనాత్మకమైనదే. అందుకే దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది.
మూడు గంటల్లోనే సర్కారు లీగల్ నోటీసు
నిన్న ఈ కథనంపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. సాధారణంగా ఏదైనా పత్రికకు లీగల్ నోటీస్ ఇవ్వాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూసి ప్రభుత్వ అధిపతి అనుమతితో లీగల్ నోటీసులు ఇచ్చే ప్రభుత్వం ఈ కధనంపై మాత్రం వెంటనే స్పందించి నిన్న మధ్యాహ్ననికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, ఆ పత్రిక ఎడిటర్ కు, ఆ పత్రిక పబ్లిషర్ కు ఏడు పేజీల లీగల్ నోటీసులు పంపించింది. ఆధారాలు చూపించాలని, సమాధానం చెప్పాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని, చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ కథనంపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎక్కడ తమ పట్టు కోల్పోకుండా రాధాకృష్ణ ను ఇరుకున పెట్టాలా న్యాయ వ్యవస్థపై నిఘా అన్న కథను అబద్ధం అని నిరూపించేందుకు ప్రభుత్వం కూడా అడుగులు ముందుకే వేస్తుంది. ఇలా వైసీపీ ప్రభుత్వం వర్సెస్ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అనే వరకు వచ్చింది. మధ్యలో న్యాయవ్యవస్థ ప్రస్తుతానికి నిలబడింది.
కోర్టులో నిరూపించకపోతే…!!
ఈ కథనం మొత్తం అంశంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి వైసిపి, వైసిపి లో అధికారులు. రెండు ఆంధ్రజ్యోతి పత్రిక, ఆమోద పబ్లికేషన్స్. ఈ కథనం నిజం అని ఆంధ్రజ్యోతి కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ వద్ద ఉన్న ఆధారాలు బయట పెట్టాల్సి ఉంటుంది. అది జరిగితే.. అంటే ప్రభుత్వం నిజంగా న్యాయవ్యవస్థ పై నిఘా నిజంగా ఉంచితే.., కారకులు, అధికారులపై చర్యలు తీసుకుంటారో కానీ న్యాయవ్యవస్థ మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది. లేని పక్షంలో కథనం ఆవాస్తవం, ఉహాజనితం అయితే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మూత దశకు చేరుకుంటుంది. కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ప్రభుత్వం.. ఆంధ్రజ్యోతి పై చర్యలు తీసుకోవడానికి ఈ కథనాన్ని సరైన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వమా? ఆంధ్రజ్యోతి వ్యవస్థ? అనేది ఈ కథనం ద్వారా ఈ అంశం ద్వారా తేలిపోనుంది.