సమాచార హక్కు చట్టం దరఖాస్తుల ద్వారా ఎన్నో సార్లు బహిర్గతం అయిన విషయం ఏంటంటే ఉద్యోగం- నిరుద్యోగం గణాంకాలగురించిన లేబర్ బ్యూరో నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నవని. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విషయం మీద ఎందుకు అంత మౌనంగా ఉంది?
జనవరి 31వ తారీఖున భారతీయ జనతా’ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చెయ్యని జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO) వారి నిరుద్యోగ సమాచారం గురించి బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రచురించింది. అందులో పేర్కొన్న సంఖ్యలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దేశంలో గత నలభై ఐదు సంవత్సరాలలో లేని విధంగా నిరుద్యోగ శాతం 6.1 శాతానికి చేరుకుంది.
ఇందులో ఇంకా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ సంఖ్య కూడా ఒక రకంగా పూర్తిగా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. ఎందుకు అంటే నోట్ల రద్దు తరువాత నిరుద్యోగ సమాచారం అసలు సేకరించనే లేదు కాబట్టి. బహుశా ఈ ఆందోళనకరమైన సంఖ్య వల్లనే కావొచ్చు సమాచార హక్కు చట్టం కింద ఈ సమాచారం సేకరించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వలేదు.
జనవరి 28నాడు జాతీయ గణాంకాల మండలి (National Statistics Commission) లో ఉన్న ప్రభుత్వేతర సభ్యులు ఇద్దరు(అందులో ఉంది ఇద్దరే ప్రభుత్వేతర సభ్యులు) రాజీనామా చేశారు. వారి రాజీనామాకి ఒక కారణం ఏమిటంటే జాతీయ గణాంకాల మండలి ఆమోదించిన తరువాత కూడా కొత్తగా నిర్వహించిన ఉద్యోగ సర్వే ఫలితాలను విడుదల చెయ్యటంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం. మా ప్రయత్నాల పరంపరలో ఇదొక ఘట్టం.
ఉద్యోగాల సమాచారాన్ని ఎవరు సేకరిస్తారు?
లేబర్ మార్కెట్ సమాచారాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సారి జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO) వారు తమ ఉద్యోగ-నిరుద్యోగ సర్వేల ( Employment-Unemployment Surveys) ద్వారా సేకరిస్తారు. ఒక ప్రభుత్వ విధానాన్ని రూపొందించటానికి ఈ సర్వే ద్వారా తెలియవచ్చే ఉద్యోగ-నిరుద్యోగ శాతాలు, మహిళా కార్మికుల శాతం, ఇతరత్రా మార్కెట్ సూచీలు అత్యవసరం.
ఐదు సంవత్సరాల షెడ్యూల్ ప్రకారం చివరిసారిగా ఈ ఉద్యోగ సర్వే 2016-17లో జరిగి ఉండవలసింది. కానీ అస్పష్ట కారణాలతో ఈ సర్వే వాయిదా పడింది. ప్రజా క్షేత్రంలో ఈ ఎన్.ఎస్.ఎస్.వో సర్వే గురించి ఎటువంటి సమాచారం లేకపోవటం 2018 మే నెలలో మమ్మల్ని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చెయ్యడానికి పురిగొల్పింది.
జూన్ లో కార్మిక మంత్రిత్వశాఖ మా దరఖాస్తుకి 2017-18 ఎన్.ఎస్.ఎస్.వో ఉద్యోగ-నిరుద్యోగ సర్వే నిలిపివేశారు అని జవాబు ఇచ్చింది. ఎందుకు నిలిపివేశారు అని మేము అడిగిన మరొక ప్రశ్నకి మంత్రిత్వశాఖ ఇచ్చిన జవాబు ఏమిటంటే
“ కార్మికుల గణాంకాల సమాచారం మరింత తరుచుగా రావలసిన అవసరం ఉన్నందున నిర్ణీత కాల కార్మిక సర్వే(Periodic Labour-Force Survey) పేరు మీద కొత్త ఉద్యోగ-నిరుద్యోగ సర్వేని ఏప్రిల్, 2017 లో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది.”
అంతే కాక మంత్రిత్వ శాఖ జవాబులో నిర్ణీత కాల కార్మిక సర్వే సమాచారం డిసెంబర్, 2018 కల్లా లభ్యం అవుతుంది అని కూడా పేర్కొన్నారు. కాకపోతే ఇప్పటికి ఆ సమాచారాన్ని విడుదల చెయ్యలేదు.
ప్రతి సంవత్సరం ఎంతో కొంత సమాచారం అందుబాటులో ఉంచేందుకు 2010 నుండి వార్షిక ఉద్యోగ-నిరుద్యోగ సమాచారం సేకరించే పని కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ బ్యూరోకి అప్పచెప్పింది. ఇప్పటికి అవి ఐదు సర్వేలు జరిగాయి. ఎన్.ఎస్.ఎస్.వో ఉద్యోగ-నిరుద్యోగ సర్వేని నిలిపివేయ్యటం, నిర్ణీత కాల కార్మిక సర్వే సమాచారం అందుబాటులో లేకపోవటం వల్లన అందుబాటులో ఉన్న అధికారిక కార్మిక సమాచారం ఈ సర్వేలే.
కాకపోతే దురదృష్టవశాత్తు ఈ లేబర్ బ్యూరో సర్వేలు ఇటు అందుబాటులోనూ లేవు, అటు క్రమం తప్పకుండానూ లేవు. తెలియని కారణాల వల్ల 2014-15లో ఈ సర్వే జగరలేదు. అంతే కాక ఈ సర్వే ఫలితాలని అందరికి తెలియచెప్పే విధానం అస్పష్టమైనది. సాధారణంగా, ఎన్.ఎస్.ఎస్.వో ఉద్యోగ-నిరుద్యోగ సర్వే సమాచారం అందరికి అందుబాటులో ఉంటుంది, అలాగే సూక్మ స్థాయి సమాచారం కూడా ఉచితంగా దొరుకుతుంది.
మాకు తెలిసినంత వరకు 2015-16 కి ముందు జరిగిన లేబర్ బ్యూరో సర్వే నివేదికలు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో కానీ, ఇంకే ప్రభుత్వ వెబ్ సైట్ లో కానీ అందుబాటులో లేవు. బహుశా ఆ నివేదికలు సుస్థిర ఉద్యోగ కేంద్రం (Centre for Sustainable Employment) వారి వెబ్ సైట్ లో ఉంది ఉండొచ్చు. అదే కాక లేబర్ బ్యూరో నివేదికలలోని సూక్ష్మ స్థాయి సమాచారం ప్రజలకి అంత తేలికగా అందుబాటులో లేదు.
2018 మధ్య వరకు లేబర్ బ్యూరో వారి తదుపరి వార్షిక సర్వే (2016-17) గురించి ఎటువంటి సమాచారం లేదు. అధికారిక లేబర్ డేటా లేకపోవటం అనేది స్పష్టంగా తెలియటం, అలాగే దీనిగురించి ఉన్న అసంతృప్తిని గమనించి పరిస్థితిని చక్కదిద్దటానికి 2018 జూన్ 11 నాడు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే ” ఆరవ వార్షిక ఉద్యోగ-నిరుద్యోగ సర్వే (2016-17) కి సంబంధించిన క్షేత్ర స్థాయి పని పూర్తి అయ్యింది. డేటా ఎంట్రీ పని కొనసాగుతుంది. ఆరవ వార్షిక ఉద్యోగ-నిరుద్యోగ సర్వే నివేదిక సెప్టెంబర్, 2018 కల్లా పూర్తి అవుతుంది.”
ఆ పత్రికాప్రకటనని ఆధారం చేసుకుని లేబర్ బ్యూరో వారి ఆరవ వార్షిక ఉద్యోగ-నిరుద్యోగ నివేదిక, సూక్ష్మ స్థాయి డేటా విడుదల తారీఖు కోరుతూ అక్టోబర్, 2018 లో మేము సమాచార హక్కు చట్టం కింద రెండవ దరఖాస్తు దాఖలు చేశాము. దీనికి జవాబుగా మంత్రిత్వ శాఖ పేర్కొన్నదేమిటంటే నివేదిక తయారీ చివరి అంకం లో ఉంది, “తొందరలోనే విడుదల చేసే అవకాశం ఉంది” అని. ఎటువంటి తారీఖు ఇవ్వలేదు. దీని తరువాత నిపుణుల కమిటీ వివరాలు, సమావేశాల మినిట్స్ గురించి మూడో సారి దరఖాస్తు చేశాము.
ఈ మూడో దరఖాస్తుకు జవాబుగా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఏమిటంటే ప్రొఫెసర్. ఎస్.పీ.ముఖర్జీ ఆధ్వర్యంలో ఆరవ వార్షిక ఉద్యోగ-నిరుద్యోగ సర్వే అంశం మీద సెప్టెంబర్ 17 ,2018 నాడు జరిగిన నిపుణుల కమిటీ సమావేశం “స్వల్ప మార్పులతో నివేదికని ఆమోదించింది.” మంత్రిత్వ శాఖ అనుమతి తరువాత నివేదిక సారాంశాన్ని విడుదల చెయ్యమని సిఫార్సు ఇచ్చింది.
కానీ ఈనాటికి లేబర్ బ్యూరో గణాంకాలు,నివేదికలు అందుబాటులో లేవు. బహుశా నివేదిక తయారుగా ఉంది అనే దానికి ఒకే ఒక్క సూచన జనవరి 11వ తారీఖున ఆరవ లేబర్ బ్యూరో ఉద్యోగ-నిరుద్యోగ సర్వే నుండి ఉటంకిస్తూ రాసిన బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం. సమాచారం, నివేదిక తయారుగానే ఉన్నదనీ, 2018 లోనే విడుదల అవుతుందనీ సమాచార హక్కు చట్టం దరఖాస్తులకి జవాబుల్లో చెప్పారు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయం మీద ఎందుకు అంత మౌనంగా ఉంది?
కులాలవారి గణాంకాలు
అందుబాటులో లేకపోవటం అనే కాక లేబర్ బ్యూరో సర్వే కంటెంట్కు సంబంధించి చాలా ప్రశ్నలు ఉనాయి. అన్ని ఎన్.ఎస్.ఎస్.వొ ఉద్యోగ-నిరుద్యోగ సర్వేలలో అడిగిన ప్రశ్న- కుటుంబసభ్యుల మతం- లేబర్ బ్యూరో సర్వే ప్రశ్నావళినుండి తొలగించారు. నిర్దిష్టంగా, ఆరవ ఉద్యోగ-నిరుద్యోగ సర్వే గురించి చెప్పాలంటే,సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది ఏంటంటే వ్యక్తి విద్య,ఉద్యోగ సమాచారం గురించి సేకరించినప్పుడు ఆ వ్యక్తి కుల సమాచారాన్ని తొలగించాలి అని నిపుణుల కమిటీ నిర్ణయించింది అని.
ఆ వివరాలు లేని విధంగా కేవలం “టోకు” పరిస్థితి గురించి నివేదికలో పొందుపరచాలి అని కమిటీ సిఫార్సు చేసింది. ఇటీవల వచ్చిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్, 2018 ప్రకారం ఈనాటికి సంపాదనలో, ఉద్యోగాలలో కుల అంతరాలు పదిలంగా ఉన్నాయి.
ఒక క్రియాశీల పౌరసమాజం కోసం నమ్మదగిన లేబర్ డేటా నివేదికలు అత్యావశ్యకం. ఇప్పటికీ విడుదల చెయ్యని ఇటీవలి ఉద్యోగ-నిరుద్యోగ సర్వేనుండి కులాల వారి సమాచారాన్ని ఎందుకు నిలుపుదల చేశారు అనేదానికి ఇప్పటికి కారణం తెలియదు. ఈ నిపుణుల కమిటీలోకి సభ్యులని తీసుకోవడానికి ఎటువంటి ప్రాతిపదిక వాడారు అని అడుగుతూ దాఖలు చేసిన సమాచార హకు చట్టం దరఖాస్తుకి ఇంకా జవాబు ఇవ్వలేదు. ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలలో ఒక క్రియాశీలక పారదర్శకత లేకపోవడం అనుమానాస్పదమే కాక ప్రజాస్వామ్యానికి తిరోగమనత కూడా.
భారతదేశ లేబర్ మార్కెట్ లొ జరుగుతున్న వేగవంతమైన మార్పులకి అనుగుణంగా క్రమానుగతమైన, చలనశీలమైన, సమగ్రసర్వేల ద్వారా సేకరించిన ఖచ్చితమైన, ప్రజలకి అందుబాటులో ఉండే సమాచార ఆవశ్యకత ఉంది. చెప్పాలంటే, ఉద్యోగ సమాచారాన్ని మెరుగుపరిచే అంశం మీద నీతి ఆయోగ్ ఏర్పరిచిన టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఇదే. లేబర్ సమాచారాన్ని “మెరుగుపరిచే” ప్రయత్నాలుఆ ఉద్యోగ సమాచారాన్ని ఇంకా దిగజార్చాయి.
మొన్నీమధ్యజరిగిన జాతీయ గణాంకాల మండలి సభ్యుల రాజీనామా ఉద్యోగ సమాచారాన్ని విడుదల చెయ్యటంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్నఅస్పష్ట ధోరణికి ఒక సంకేతం.
-రోసా అబ్రహాం, జానకి శిబు, రాజేంద్రన్ నారాయణన్
ఈ ముగ్గురు రచయితలూ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో పని చేస్తున్నారు.
‘ద వైర్‘ వెబ్సైట్ సౌజన్యంతో