YS Sharmila ; ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆమె వైరల్ అవుతున్నారు. నాన్న చనిపోయిన తర్వాత అన్నకి తోడుగా YS Sharmila వేలాది కిలోమీటర్లు నడిచి పార్టీని నిలబెట్టిన ఆమె… ఇప్పుడు అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నారా..? అన్న ఆశీస్సులతోనే పార్టీ పెడుతున్నారా..? ఆమె వెనుక ఎవరున్నారు అనే కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల రాజకీయ ప్రవేశం మాత్రం సాదా సీదాగా ఉండబోదని.., భారీ ప్రణాళికతో దిగుబోతున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..!!
YS Sharmila ; లోటస్ పాండ్ వద్ద హడావిడి..!!
ఈరోజు వైఎస్ రాజకేఖర్ రెడ్డి, విజయమ్మల 50 వ పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఆమెలోని రాజకీయ ప్రవేశం ఆలోచనలను వైఎస్ అభిమానులతో పంచుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. సుమారుగా 40 రోజుల పాటూ వైఎస్ అభిమానులతో సమావేశాలు పెట్టి… మార్చి నెలాఖరుకి ఒక ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 8 న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహించి తన ప్రత్యక్ష రాజకీయ ప్రవేశ ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. కానీ… ఒక్కటి మాత్రం ఖాయం. ఇది షర్మిల అన్న , ఏపీ సీఎం జగన్ కి పూర్తి భిన్నంగా జరుగుతుంది అని, ఆయన ప్రమేయం ఏ మాత్రం లేదని తెలుస్తుంది.
Must Read ; షర్మిల అడుగులు – వైసీపీలో గుబులు..!?
ఒక్క ఫ్లెక్సీ.. అనేక ఆలోచనలు..!!
లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు ఏపీలో కాక రేపుతోంది. వైఎస్ షర్మిలక్క అంటూ ఫ్లెక్సీ ఉంది. దీనిలో ఎక్కడా జగన్ ఫోటో, వైసీపీ పార్టీ జెండా, పేరు ఏమి లేవు. కేవలం రాజశేఖర్ రెడ్డి ఫోటో , షర్మిల ఫోటో మాత్రమే ఉన్నాయి. సో.. జగన్ నీడ కూడా తనపై పడకుండా ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా తన రాజకీయ ప్రవేశం ఉండాలని షర్మిల భావించి ఉండవచ్చు.
* ఒకవేళ షర్మిల తెలంగాణాకి మాత్రమే పరిమితం కావాలి అనుకుంటే… వైసీపీ జెండా, పేరు వాడుకుని తెలంగాణాలో శాఖని నిర్వహించవచ్చు కదా..? ఒకవేళ జగన్ ఆశీస్సులు, సహకారంతోనే రాజకీయ ప్రవేశం, సమావేశాలు అనుకుంటే జగన్ ఫోటో అయినా వాడాలి కదా..!? ఇవేమి లేవు.
* షర్మిల కేవలం తెలంగాణాకి మాత్రమే పరిమితం అవుతారు అనడానికి కచ్చితంగా చెప్పుకోలేం. జగన్ కీ షర్మిల కి ప్రస్తుతం గ్యాప్ ఉన్న మాట వాస్తవం. అందుకే ఏపీలోని జగన్ వ్యతిరేకుల కోసం, రాజశేఖర్ రెడ్డిని అభిమానించి, జగన్ ని వ్యతిరేకిస్తున్న కొందరు షర్మిలని ఏపీ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నమూ చేయవచ్చు.
టీఆరెస్ నుండి దాడి మొదలు..!!
తెలంగాణలో షర్మిల పార్టీ హడావిడి మొదలయిందో.. లేదో అప్పుడే టీఆరెస్ నుండి మాటల దాడి మొదలయింది. “అన్నపై అలిగితే ఏపీలో పార్టీలో పెట్టాలి.. కానీ తెలంగాణాలో ఏం చేస్తావ్ షర్మిల?” అంటూ టీఆరెస్ ముఖ్యనేత దిలీప్ పోస్ట్ చేశారు. కొందరు టీఆరెస్ నేతలు షర్మిల రాజకీయ సమావేశాలపై తోచిన కామెంట్లు చేస్తున్నారు. సో.. షర్మిల రాజకీయ ప్రవేశం తెలంగాణ రాజకీయాల్లో అయితే రగడ సృష్టిస్తుంది. ఏపీలోనూ కాక పుట్టింస్తుంది. మరో 40 రోజుల్లో మాత్రం ఒక స్పష్టత రానుంది.