అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు.
సరయూ నది, రామజన్మభూమి ఆలయం ప్రదేశం, అన్నదాన సమాజం, కౌసల్యాదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం వంటివి ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనవి.
అయోధ్యకు ఎలా వెళ్లాలి:
లక్నో, కాన్పూర్, వారణాసి వంటి ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు చక్కని రైలు రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ విమానాశ్రయం లేకపోయినా లక్నో నుంచి రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంటుంది.
విమాన మార్గం:
అయోధ్య నగరానికి పశ్చిమాన 150 కిలోమీటర్ల దూరంలో లక్నో విమానాశ్రయం ఉంది. ఇక్కడికి డిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, జైపూర్, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి నిరంతరం విమానాలు నడుస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వీలుగా జీప్ లు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం:
ఉత్తర భారతదేశంలో అయోధ్య ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఇక్కడికి డిల్లీ, లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్ పూర్, గోండా నుంచి నిరంతరం రైళ్లు నడుస్తుంటాయి. అయోధ్య రైల్వే స్టేషన్ సిటీ సెంటర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రోడ్డు మార్గం:
అయోధ్యకు అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. లక్నో నుంచి 130 కిలోమీటర్లు, వారణాసి నుంచి 200 కిలోమీటర్లు, అలహాబాద్ నుంచి 160 కిలోమీటర్లు, గోరఖ్ పూర్ నుంచి 140 కిలోమీటర్లు, డిల్లీ నుంచి 636 కిలోమీటర్ల దూరంలో అయోధ్య నగరం ఉంది.