Polavaram project: పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు పదేపదే చెప్పారు. మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. శాసనసభ, శాసన మండలి సాక్షిగానూ వెల్లడించారు. ఆయన చెప్పిన గడువు వచ్చేసింది కానీ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. దీనిక కారణాలు ఏమిటి ? పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయింది ? ప్రస్తుతం పోలవరం పనులు ఏ దశలో ఉన్నాయి ? ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది ? అనే విషయాలను పరిశీలిస్తే… దీనిలో రాజకీయ కారణాలు ఉన్నాయి. అసమర్ధత ఉందీ, కొంత మంది కావాలని వేస్తున్నదెబ్బలూ ఉన్నాయి. ఇలా పోలవరం విషయంలో అంతర్గతంగా చాలా విషయాలు దాగి ఉన్నాయి. అయితే అవన్నీ తెలియకో, ప్రజలకు ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టడానికో, లేదంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికో లేదా తాత్కాలికంగా తప్పించుకోవడానికో ప్రభుత్వానికి మొత్తం తెలిసే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఏమీ చెప్పలేక చేతులు ఎత్తేశారు. మాట తప్పం, మడమ తిప్పం అని చెబుతున్న ఈ ప్రభుత్వం ఈ విషయంలోనూ మాట తప్పడం, మడమ తిప్పడం లాగానే ఉంది.
Polavaram project: పునరావాసానికి నిధులే పెద్ద సమస్య
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనుల విషయానికి వస్తే.. కొండల మధ్య మొత్తం మూడు గ్యాప్స్ గోడల నిర్మాణానికి గానూ రెండు గ్యాప్స్ గోడల నిర్మాణం పూర్తి అయ్యింది. దానితో పాటు స్పిల్ వే నిర్మాణం పూర్తిగా అయిపోయింది. డ్యామ్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. సివిల్ వర్క్ లో 90 శాతంకుపైగా పూర్తి అయ్యాయి. సివిల్ వర్క్ పెద్ద సమస్య కాదు. రెండు మూడు నెలల్లో పూర్తి చేయవచ్చు. కానీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది పునరావాసం. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఓ పెద్ద వ్యయప్రయాసలతో కూడిన అంశం. అది పూర్తి చేయడం ప్రస్తుతం ఈ ప్రభుత్వం వల్ల కాదనే మాట వినబడుతోంది. ఒక వేళ తరువాత టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వల్ల కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే ముంపు గ్రామాల పునరావాసం కోసం రూ.29వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 2014లో విభజన చట్టం హామీ ప్రకారం అప్పుడు ఉన్న అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 20వేల కోట్లే ఉంది. అంత నిధులు ఇచ్చేశాము. ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం తప్పించుకోంటోంది. 2018 ఫిబ్రవరిలోనే తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55,569వేల కోట్లకు రివైడ్జ్ ఎస్టిమేషన్ ను కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం దాన్ని పక్కన పెట్టింది.
29 వేల కోట్లు మంజూరు చేస్తేనే ..
వైసీపీ ప్రభుత్వం వచ్చిన మళ్లీ కొత్త అంచనాలను కేంద్రానికి పంపించింది. దీన్ని కూడా కేంద్రం పక్కన పెడుతోంది. స్పందించడం లేదు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టు పూర్తి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ జాతీయ బ్యాంకుల నుండి గానీ ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తీసుకువచ్చినా 5వేలు, పదివేల కోట్లతో అది పూర్తి అయ్యేది కాదు. వాస్తవానికి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున పూర్తి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం నిధులు ఇవ్వకుండా దొంగాట ఆడుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టునకు సంబంధించి కేంద్రం సుమారు 22వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. పునరావాసం కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం 29వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తేనే ఆ ప్రాజెక్టును ఏ ప్రభుత్వం అయినా పూర్తి చేయగలదు. కేంద్రం నిధులు ఇస్తే ముంపు గ్రామాల్లో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వాళ్లకు కాలనీలను నిర్మించి అక్కడ నుండి తరలించాలి. అప్పుడు మాత్రమే స్పిల్ వే, డ్యామ్ సివిల్ వర్క్ లు పూర్తి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రాజెక్టు పూర్తి చేసుకుని ప్రారంభించే అవకాశం ఉంటుంది. కుడికాలువ పూర్తి అయ్యింది ఏడమ కాలువ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ కాలువ పనులు 75 శాతంపైగా పూర్తి అయ్యాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా సివిల్ వర్క్ లు మొత్తం పూర్తి చేసినా ఉపయోగం ఉండదు. దీనికి కేంద్రం సహకారం తప్పనిసరి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు తీరు ఎలా ఉంది అంటే పెళ్లి జరగాలంటే రోగం తగ్గాలి. రోగం తగ్గాలంటే పెళ్లి జరగాలి అన్న సామెత మాదిరిగా ఉంది.